కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/తిర్యాణి, మార్చి 9 : ప్రస్తుతం ఖైరిగూడ ఓపెన్కాస్టుకు సుమారు అరకిలోమీటరు దూరంలోనున్న గోవర్ గూడ గ్రామం.. ఒకప్పుడు వే రే ప్రాంతంలో ఉండేది. సుమారు 18 ఏళ్ల క్రితం ఖైరిగూడ ఓపెన్కాస్ట్ ఏర్పాటు సమయంలో ముంపు గ్రా మంగా గుర్తించిన అధికారులు అక్కడి నుంచి ఇక్కడికి తరలించారు. ఆ సమయంలో దూరంగా పునరావాసం కల్పించకుండా మళ్లీ ఓపెన్కాస్ట్ పక్కనే గ్రామాన్ని ఏర్పాటు చేశా రు. అదే సమయంలో సర్కారు ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు చేసి, కట్టించింది. మౌలిక వసతులు కల్పించాల్సిన సింగరేణి అధికారులు, కేవలం సీసీ రోడ్డు వేసి వదిలేశారు. ఊరి ని వదిలి వచ్చినందుకు ఎలాంటి ఆర్థిక సాయమందించలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు వంద ఎకరాల భూములు కోల్పోయామని, కొంత మందికి మా త్రమే ఎకరాకు రూ. ఆరు వేల దాకా పరిహారమిచ్చి చేతులు దులుపుకున్నారని, మిగతా వారిని పట్టించుకోలేదని, 18 ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నామని వారు పే ర్కొంటున్నారు. ఓపెన్కాస్టు దుమ్ము వల్ల కనీసం మిగిలి ఉన్న భూముల్లోనైనా పంటలు వేసే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. మౌలిక వసతులతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేలుళ్లు.. దట్టమైన దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఒకప్పుడు మా ఊరు వేరే చోట ఉండేది. ఓపెన్కాస్టు పడుతుందని ఇక్కడికి తీసుకొచ్చి న్రు. ఖైరిగూడకు దాదాపు అర కిలోమీటర్ దూరంలోనే గ్రామాన్ని ఏర్పాటు చేసిన్రు. కనీసం సౌకర్యాలు కూడా కల్పించలే. ఒక్క రోడ్డేసిన్రు. ఓపెన్కాస్టు పేలుళ్లతో మా ఇండ్లన్నీ దెబ్బతింటున్నయ్. గోడలన్నీ పగుళ్లు చూపిన య్. ఎప్పుడు కూలిపోతయోనని భయపడుతున్నం. మా గ్రామాన్ని సురక్షి తమైన ప్రాంతానికి తరలించి ఆదుకోవాలి.
– ఆత్రం గుండయ్య, గోవగూడ
మాకు ఎకరంన్నర భూమి ఉండే. ఓపెన్కాస్టు కింద పోయింది. బంగారంలాంటి భూమి వదిలేసి రావాల్సి వచ్చింది. మంచిగ పంటలేసుకొని బతికేటోళ్లం. గా భూమి తీసుకున్నోళ్లు కనీసం ఇంత వరకు పరిహారం కూడా ఇవ్వలే. అడిగితే మా భూమి ముంపులో పోలేదన్నరు. అందులో పంటలేసుకుందామంటే ఓపెన్కాస్టు దుమ్ముతో పండడం లేదు. ఇక్కడ బతుకుడు కష్టమైతంది. సర్కారోళ్లే మాకు న్యాయం చేయాలే.
– ఆత్రం నాగు, గ్రామ పటేల్
ఈ చిత్రంలో కనిపిస్తున్నది తిర్యాణి మండలంలోని గోవర్ గూడ గ్రామం. ఇక్కడ 28 కొలాం కుటుంబాలు నివసిస్తున్నాయి. పక్కనే ఉన్న ఖైరిగూడ ఓపెన్ కాస్టు పేలుళ్లతో ఊరిలోని ఇండ్లన్నీ పగుళ్లు తేలి కూలిపోయే దుస్థితి వచ్చింది. ఈ పునరావాస గ్రామంలో మౌలిక వసతులు కల్పించాల్సిన సింగరేణి అధికారులు, కేవలం సీసీ రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారే తప్ప.. తమ గోడును పట్టించుకోవడం లేదంటూ గిరిజనం మండిపడుతున్నది. అటు ఊరిని వదిలి వెళ్లలేక.. ఇటు ఇళ్లలో ఉండలేక నిత్యం భయాందోళనల మధ్య బతుకులీడుస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నది.