Traditional Occupations | తెలంగాణ రాక ముందు కుల వృత్తులను నమ్ముకొని జీవించే వారిని ఓటు బ్యాంక్గా చూడటం తప్పా.. వారి అభివృద్ధి, సామాజిక, ఆర్థిక పురోగతిని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఉద్యమంలో ఊరూరా తిరిగిన కేసీఆర్ తెలంగాణకు జీవనాడి కులవృత్తులేనని గుర్తించారు. వాటినే నమ్ముకొని బతుకుతున్న వర్గాలు బాగుంటేనే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో స్వరాష్ట్రంలో కులవృత్తులకు పెద్దపీట వేశారు. గొల్ల, కురుమలకు గొర్లు పంపిణీ చేసినా, మత్స్యకారులకు చేప పిల్లలు ఇచ్చినా, గౌడన్నలకు చెట్టు పన్ను రద్దు చేసినా, పింఛన్లు, బీమా సదుపాయం కల్పించినా.. ధోబీఘాట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్ ఇచ్చినా.. అది ఆ వర్గాలను బాగుచేయాలనే. ఇన్ని చేసినా ఆయన సంతృప్తి చెందలేదు.
తెలంగాణ ఉద్యమంలో తాము సైతమని భుజం కలిసి, సకల జన్ముల సమ్మేలో కీలక పాత్ర పోషించిన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కులవృత్తులనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న కుటుంబాలకు రూ.లక్ష సాయం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన విధివిధానాలను సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగాన్ని పురమాయించారు. ముఖ్యమం త్రి కేసీఆర్, మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయంపై సబ్బండ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మనసున్న మా రాజు సీఎం కేసీఆర్ అని వేయినోళ్ల పొడుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా లక్షల కుటుంబా లకు ఈ సాయం అందనున్న నేపథ్యంలో ఆయా వర్గాలను ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..
– మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, మే 21 (నమస్తే తెలంగాణ)
ఇది వరకున్న సర్కారోళ్లు కుల వృత్తిదారులను పట్టించుకున్న పాపాన పోలేదు. పని లేక పట్టణాలకు పోయినోళ్లు మస్తు మంది ఉన్నరు. కొందరైతే కుటుంబాలను వదిలేసి దేశం విడిచిపోయిన్రు. చాలీ చాలని వేతనాలతో అష్టకష్టాలు పడ్డరు. కానీ.. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోస్తున్నారు. ఇప్పుడు పట్టణాలు, విదేశాలకు వెళ్లిన వారు సైతం తిరిగొచ్చి పని చేసుకుంటున్నరు. చేతినిండా సంపాదించి దర్జాగా బతుకుతున్నరు. మా నాయీబ్రాహ్మణులకైతే రూపాయి కూడా ఖర్చులేకుండా ఉచితంగా మీటర్లు పెట్టి కరెంటిస్తున్నడు. ఇప్పుడు మళ్లా కుల వృత్తిదారులకు రూ. లక్ష చొప్పున సాయం చేస్తామని చెప్పిండు. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. గిసొంటి సీఎం ఉన్నంత కాలం ప్రజలకు ఢోకా లేదు. ఆయనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. అందరూ ఆయన వెంటే నడవాలి.
– మెట్టుపల్లి శంకరయ్య, నాయీబ్రాహ్మణుడు (లక్షెట్టిపేట)
కోటపల్లి, మే 21 : కులవృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవాలి అనుకోవడం సంతోషం. కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవడంతో చాలా మంది వృత్తులు వదులుతున్నారు. సీఎం కేసీఆర్ అండగా ఉండేందుకు కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడం సంతోషం. కులవృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం సాయం చేయడం పునరుజ్జీవం పోయడమే అవుతుంది.
– కుందారపు కొమ్మురయ్య, కుమ్మరి, వెలమపల్లి(కోటపల్లి)
లక్షెట్టిపేట రూరల్, మే 21: కులవృత్తులకు సీఎం కేసీఆర్ సార్ జీవం పోసిండు. ఆయన నిర్ణయం వల్ల అనేక మంది యువకులు ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే రజక, నాయీబ్రాహ్మణులకు ఉచిత కరెంటు ఇస్తున్నరు, గౌడ కులస్తులకు పింఛన్లతో పాటు బీమా అందిస్తున్నరు. ఇక ఇప్పుడు కులవృత్తి దారులకు రూ. లక్ష సాయం అందిస్తామని చెప్పారు. ఇది గొప్ప నిర్ణయం. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాలకు న్యాయం చేసింది ఒక్క మన ముఖ్యమంత్రి కేసీఆరే.
– మోత్కూరి వెంకటస్వామి గౌడ్,గీత కార్మికుడు, లక్షెట్టిపేట
కోటపల్లి, మే 21 : కుల వృత్తుల పరిరక్షణకు రూ. లక్ష వరకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం నేతన్నలకు వరంలాంటింది. నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఉత్సాహంగా పని చేస్తున్నారు. ఇప్పటికే సబ్సిడీపై నూలు అందచేయడంతోపాటు 50 ఏండ్లు నిండిన నేత కార్మికుడికి ఆసరా పింఛన్ కూడా ఇస్తూ అండగా నిలుస్తున్నది. ఇటీవల నేతన్నల కోసం రూ.5 లక్షల బీమా అమలు చేసిన ప్రభుత్వం తాజాగా నేత వృత్తిని ప్రోత్సహించేందుకు రూ. లక్ష వరకు ఆర్థిక సహాయం అందించాలనే నిర్ణయం మంచిది.
– దేవులపల్లి సునీత-భాస్కర్, కొల్లూరు(కోటపల్లి)
లక్షెట్టిపేట, మే 21: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కుల వృత్తిదారుల గురించి పట్టించుకున్నోళ్లు లేకుండె. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్ని వర్గాల బాగు కోసం కృషి చేస్తున్నారు. సరైన జీవనోపాధి లేని సమయంలో చెరువులు, కుంటల్లో చేప పిల్లలను పోసి భరోసానిచ్చారు. ఇప్పుడు చేపలు పట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఆయన మనసున్న వ్యక్తి. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటేనే అందరికీ న్యాయం జరుగుతది. కుల వృత్తిదారులకు రూ. లక్ష చొప్పున సాయమందిస్తామని చెప్పినందుకు ఆనందంగా ఉంది.
– జిన్ని సత్యం, మత్స్యకారుడు, లక్షెట్టిపేట
వృత్తిదారులకు న్యాయం చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించినది లేదు. గత ప్రభుత్వాలేవీ కులవృత్తులపై ఆధారపడిన వారిని ఆదుకున్నది లేదు. అసలు వారి గురించి ఆలోచన చేసిన వాళ్లే కనిపించలేదు. బీఆర్ఎస్ సర్కారు గౌడన్నలకు జీవిత బీమా సౌకర్యం తీసుకువస్తామని చెప్పింది. తాజాగా కులవృత్తిదారులకు రూ.లక్షసాయం చేస్తామనడం శుభపరిణామంగా భావిస్తున్నాం.
– ఎం. నర్సగౌడ్, మావల, గీతకార్మికుడు
కోటపల్లి, మే 21 : గీతన్నలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ తాజాగా కుల వృత్తుల పునర్జీవానికి రూ. లక్ష సాయం అందిస్తామని ప్రకటించడం హర్షణీయం. ఇప్పటికే బీమా కల్పించేందుకు సరికొత్త పథకం రూపొందించడం ఆనందంగా ఉంది. ఇప్పటికే గీత కార్మికులకు పింఛన్, కల్లు అద్దె, బకాయి మాఫీ చేయడంతోపాటు వైన్ షాప్ టెండర్లలోనూ 15 శాతం రిజర్వేషన్లను కల్పించింది. తాజా నిర్ణయంతో గీత కార్మికులకు సాయం అంద చేయడం చరిత్రాత్మకం.
– ముత్యాల మల్లాగౌడ్, కోటపల్లి.
ఎదులాపురం, మే 21 : బలహీనవర్గాలను ఉన్నతస్థాయికి తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ పరితపిస్తున్నారు. కుల వృత్తిదారుల ఆర్థికాభివృద్ధి కోసం ఆలోచన చేయడం గొప్ప విషయం. ఇప్పటికే బీసీలకు వంద శాతం రాయితీతో రుణాలు అందించి అండగా నిలిచారు. వృత్తిదారులకు ఎంతో ప్రయోజనం చేకూరేలా రూ.లక్ష సాయం అందిస్తామని చెప్పారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది.
– చిక్కాల దత్తు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
కుల వృత్తులు కనుమరుగవుతున్న తరుణంలో అండగా నిలిచి పునరుజ్జీవం పోసింది ఒక్క సీఎం కేసీఆరే. గతంలో కుల వృత్తులకు సరైన ఆదరణ లేక, పనుల్లేక జీవనం కష్టమైంది. మాలాంటి వారి బాధలను గుర్తించిన సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచారు. ఇప్పుడు వృత్తిదారులకు రూ.లక్ష సాయం అందజేస్తామని ప్రకటించారు. ఇందుకు ఆనందంగా ఉంది. ఇప్పటికే హెయిర్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ప్రీ కరెంట్ ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు
– ఏ సురేశ్, హెయిర్ సెలూన్ షాపు యాజమాని