మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ), జనవరి 18 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో నిశ బ్ద బతుకుపోరాటం సాగుతున్నది. పుట్టింది మొద లు గిట్టే వరకూ అడవి తల్లినే నమ్ముకుని హాయిగా బతుకుతున్న ఆదివాసులు ఇప్పు డు బెంబేలెత్తిపోతున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ కారిడార్లో పదేళ్లుగా పులుల సంతతి బాగా పెరిగింది. ఒకప్పుడు ఒకటీ రెండు పులులు మహారాష్ట్ర, ఇంద్రావతి, ప్రాణహిత, తడో బా నుంచి మన అడవుల్లోకి వచ్చి వెళ్లేవి. కా నీ.. ఇటీవల కాగజ్నగర్ ఫారెస్ట్ పులుల ఆవాసంగా మారింది.
ఇక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకున్నాయి. ఈ క్రమంలోనే గడిచిన మూడేళ్లలో ఆదివాసులు, పశువులపై పులుల దాడులు పెరిగాయి. ముగ్గురు ఆదివాసులు చనిపోగా.. వందలాది పశువులు పులుల ఆకలికి బలైపోయాయి. ప్రపంచానికి దూరంగా అడవుల్లో ఉంటున్న ఆదివాసులు.. ఇప్పుడు బతుకు పోరాటం చేయాల్సి వస్తున్నది. అధికారుల నిర్లక్ష్యం, ఆదివాసులు అంటే చిన్నచూపుతో పులులపై దాడులు చేసే వరకు వె ళ్లిందనడంలో సందేహం లేదు. తాజాగా కాగజ్నగర్ డివిజన్లో విషప్రయోగం చేసి పులులను హతమార్చడం ఉదాహరణగా నిలుస్తున్నది.
పులి దాడిలో మనుషులు చనిపోతే రూ.5 లక్షలు.. పశువులు(ఆవులు, ఎడ్లు) చనిపోతే రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టపరిహారం చెల్లించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పులులు చనిపోతే స్పందిస్తున్న జాతీయస్థాయి స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులు.. అదే పులుల దాడుల్లో ఆదివాసులు, పశువులు చనిపోయినప్పుడు పట్టించుకోవడం లేదు.
న్యాయం చేయాల్సిన అధికారులు ఇబ్బందులకు గురిచేసినపుడు ఆదివాసుల్లో నైరాశ్యం పెరిగి పులులపై ప్రతి దాడి చేసే వరకు వెళ్తున్నారు. రెండు పులుల మృతి వెనుక ఉన్న కారణం ఇదే కావడం గమనార్హం. పశువును పులి చంపిందన్న కోపంతో విషప్రయోగం చేసినట్లు నిందితులు విచారణలో చెప్పడం కలకలం రేపింది. కానీ.. అధికారులు ఎప్పటి మాదిరిగానే ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది.