నేరడిగొండ, జూన్ 20 : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రగతిబాటలో ముందుకు సాగుతున్నదని జడ్పీటీసీ అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ జిల్లా పరిషత్ పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో తెంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మొదట రాష్ట్ర, జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ, కొత్తగా గురుకుల పాఠశాలలను నెలకొల్పుతూ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యారంగాన్ని తలదన్నేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా విద్యా రంగానికి నిధులు కేటాయిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పెంట వెంకటరమణ, ఉపసర్పంచ్ దేవేందర్ రెడ్డి, ఎంఈవో భూమారెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
సర్కారు బడుల్లో మెరుగైన విద్య
బోథ్, జూన్ 20: సర్కారు బడుల్లో మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బోథ్, సొనాల, పిప్పల్ధరి గ్రామాల్లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మూత్రశాలలు, తాగునీటి వసతి, బెంచీలు, తదితర సౌకర్యాలతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారని తెలిపారు. బడీడు పిల్లలను బడికి పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, సర్పంచ్ సదానందం, ఎంపీడీవో లక్ష్మణ్, ఎంపీవో జీవన్రెడ్డి, ఎంఈవో భూమారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ప్రశాంత్, ఏపీఎం మాధవ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
తాంసిలో..
తాంసి, జూన్ 20 : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పురవీధుల గుండా ర్యాలీ తీశారు. కూడళ్లలో వీధి నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. విద్య ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చదివించాలని తెలియజేసే నాటికలు తల్లిదండ్రులు, గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు దాతలను ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణమూర్తి, కిష్టన్న, సంజీవరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రాజన్న, శోభారాణి, కేజీబీవీ ఇన్చార్జి ఎస్వో సౌజన్య, సర్పంచ్లు స్వప్నారత్న ప్రకాశ్, కృష్ణ, సదానందం, వెంకన్న, తూర్పుబాయి, అశోక్, జ్యోతి నర్సింగ్, దేవారెడ్డి పాల్గొన్నారు.
విద్యారంగానికి ప్రాధాన్యం
ఇచ్చోడ, జూన్ 20 : విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి అన్నారు. మండలంలోని మల్లపూర్, ముక్రా(కే) ముక్రా(బీ), ఇచ్చోడ, మాధపూరి, సిరిచెల్మ గ్రామాల్లో విద్యార్థులు ర్యాలీ తీశారు. ఇచ్చోడ ప్రాథమిక పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థినులు తెలంగాణ తల్లి వేషధారణతో పలువురిని ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, సర్పంచ్లు సునీత, మీనాక్షి, విజయ పాల్గొన్నారు.
సిరికొండలో..
సిరికొండతో పాటు రాయిగూడ, సుంకిడి, పొన్న, సోంపెల్లి, వాయిపేట్ గ్రామాల్లో ఘనంగా విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు ర్యాలీ తీసి విద్యపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు ఉపాధ్యాయులు అందజేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం రాధాకృష్ణ, ఉపాధ్యాయులు వేణుగోపాల్ రెడ్డి, నవనీత్ రెడ్డి, కాంతయ్య, భాస్కర్, సీతారాం, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్లో..
బజార్హత్నూర్, జూన్ 20: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులు పురవీధుల గుండా ర్యాలీ తీశారు. కూడళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో అందించే విద్యపై పలు ప్రదర్శనలు నిర్వహించారు. అంతేకాకుండా పాఠశాలలో విద్యలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీకాంత్, ఉపాధ్యాయులు ప్రత్యూష, రాజశేఖర్, రమణ, ఆర్టీవీ ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు.
భీంపూర్, జూన్ 20 : విద్యాదినోత్సవం సందర్భంగా భీంపూర్ అంగన్వాడీలో సర్పంచ్ లింబాజీ 50 మంది పిల్లలకు పలక, బలపలు అందజేసి అక్షరాభ్యాసం చేయించారు. అంతార్గంలో ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమ్ర సుధకర్, సర్పంచ్లు లింబాజీ, సాత్విక, రామబాయి, ఉపాధ్యాయులు, నాయకులు రవీందర్, రాథోడ్ ఉత్తమ్, పాల్గొన్నారు.