కెరమెరి, అక్టోబర్ 20 : స్వరాష్ట్రంలోనే జోడేఘాట్కు గుర్తింపు వచ్చిందని జడ్పీ చైర్పర్సన్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని జోడేఘాట్, కొలాంగూడ, పెద్ద పాట్నాపూర్, చిన్న పాట్నాపూర్, బాబేఝరి, మహారాజ్గూడ, శివగూడ, పాటాగూడ, పిట్టగూడ, టోకెన్మోవడ్ గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా కోవ లక్ష్మి, ఆత్రం సక్కుకు డప్పువాయిద్యాలు, హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి గూడేల్లో ప్రజల బాగోగులు తెలుసుకుంటూ, సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్ సుపరిపాలన దేశానికే ఒక రోల్ మోడల్గా మారిందని, ఇక్కడ అమలవుతున్న పథకాలు చూసి కేంద్రంతో పాటు పొరుగు రాష్ర్టాలు కూడా ప్రశంసిస్తున్నాయని చెప్పారు.
ఒకప్పుడు జోడేఘాట్లో సౌకర్యాలు లేక గ్రామం వీడాల్సిన దుస్థితికి రాగా, గ్రామస్తులకు నచ్చజెప్పి కొంతకాలం ఆగండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తుందని సమస్యలన్ని తీరిపోతాయని ఆ రోజే చెప్పామన్నారు. ప్రస్తుతం జోడేఘాట్ అందరికి ఆదర్శంగా మారిందని, కేసీఆర్ సంకల్పం వల్ల ఇచ్చిన మాటకు కట్టుబడి పోరుగడ్డను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారని చెప్పారు. కల్లిబొల్లి మాటలతో చెప్పి అధికారంలోకి రావాలని చూస్తున్న ఇతర పార్టీలను నమ్మి మోసపోవద్దన్నారు. ఆదివాసులకు పోడుభూముల పట్టాలతో పాటు రైతుబంధు అందించి ఆదుకున్న బీఆర్ఎస్ పార్టీకే అండగా నిలవాలని, రానున్న రోజుల్లో మరింత సంక్షేమం, అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు.
మూడో సారి అధికారంలోకి రాగానే అందరికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు నిర్మించేందుకు రూ.3 లక్షలు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావ్, ఎంపీపీ పెందోర్ మోతీరాం, జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి, వైస్ ఎంపీపీ సయ్యద్ అబూల్ కలాం, మాజీ కోఆప్షన్ సభ్యుడు షేక్ ఖొత్బొద్దీన్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు కుమ్రం నాణేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు రాథోడ్ ఉత్తం నాయక్, షేక్ యూనుస్, రఘునాథ్, దుందురావ్, తిరుపతి, తొడసం జగన్నాథ్రావ్, ధర్ము, వెంకటేశ్వర్, ఇఫ్తేకర్ అహ్మద్, కుడ్మెత సోముతో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.