ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 28 : ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్ అన్నారు. బుధవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలోని తన చాంబర్లో జంగుబాయి ఉత్సవాల ప్రచార పోస్టర్, ఆహ్వాన పత్రికలను కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో కొలువైన జంగుబాయి దేవస్థానం పవిత్ర పుష్యమాసం ఈ నెల 26 నుంచి జనవరి 20వ తేదీ వరకు కోట పరందోలి బీడ్వార్ గోండులు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ర్టాల ప్రజలు పెద్దసంఖ్యలో వస్తారని పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నదని అన్నారు. భక్తులకు అవసరమై మౌళిక సదుపాయాలు ప్రాజెక్టు అధికారి ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో ఏపీవో జనరల్ కనక భీంరావ్, అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి కరీం, పెసా కోఆర్డినేటర్ వసంత్, జిల్లా సార్మేడి దుర్గు పటేల్, జంగుబాయి దేవస్థానం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కొడప జాకు, గౌరవాధ్యక్షుడు బాజీరావ్, ఉపాధ్యక్షుడు రాయిసిడాం జంగు, జాకీరావ్, సభ్యులు పాల్గొన్నారు.