ఉట్నూర్ రూరల్, జనవరి 27 : మండలంలోని శ్యాంపూర్ గ్రామంలోని బుడుందేవ్కు మెస్రం వంశీయులు శుక్రవారం ఘనంగా పూజలు నిర్వహించారు. గురువారం కేస్లాపూర్ నుంచి శ్యాంపూర్కు ఎడ్లబండ్లు, కాలినడకన చేరుకొని బస చేశారు. సంప్రదాయ వాయిద్యాలతో నైవేద్యాలు సమర్పించారు. గంగాజలంతో అభిషేకించారు. శుక్రవారం నుంచి జాతర ప్రారంభం కానుంది. తమ తాతలు, తండ్రుల కాలం నుంచి వస్తున్న ఆచారాల ప్రకారం పూజలు నిర్వహిస్తున్నట్లు మెస్రం వంశీయులు పేర్కొన్నారు. ప్రతి ఏటా ఆచారంగా వస్తున్న పూజల నిర్వహణ ఇలాగే కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
కేస్లాపూర్లో ఏర్పాటు చేసిన వివిధ వస్తువుల దుకాణాలు రెండు రోజుల్లో ఇక్కడకు రానున్నాయి. బుడుందేవ్ ( ఆంబోతు)ను నందిగా భావిస్తారు. దీంతో అత్యంత ప్రాధాన్యం కలిగిన దేవుడిగా కొలుస్తూ పూజలు చేస్తారు. ఎంపీపీ పంద్ర జైవంత్రావ్, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ మెస్రం వంశీయులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఉట్నూర్ మండల, మారుమూల గ్రామాల ప్రజలకు శ్యాంపూర్ బుడుందేవ్ జాతర ప్రత్యేకంగా నిలువనున్నదని పేర్కొన్నారు. ప్రతి యేటా మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జాతర ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్యాంపూర్ సర్పంచ్ గుండాల మల్లిక, మెస్రం వంశీయులు తదితరులు పాల్గొన్నారు.