చెన్నూర్, నవంబర్ 27 : చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్కు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం నిర్వహించిన రోడ్షో జాతరను తలపించింది. మొదటి సారి ఇక్కడికి రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. జనమా…గులాబీ వనమా.. అన్నట్లు తెలంగాణ తల్లి చౌరస్తా కిక్కిరిసి పోయింది. మధ్యాహ్నం 1.10 గంటలకు మంత్రి కేటీఆర్ హెలిక్యాప్టర్లో పట్టణంలోని మినీ స్టేడియానికి చేరుకున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బస్సులో ప్రధాన రహదారి గుండా రోడ్షో నిర్వహిస్తూ తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మంత్రి కేటీఆర్ ప్రజలనుద్దేశించి 26 నిమిషాల పాటు ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సాధించిన అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ వల్ల చెన్నూర్ నియోజకవర్గంలో జరిగిన ప్రగతి గురించి చెప్పుకొచ్చారు. మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఎలా నష్టపోతామో వివరించారు.
బాల్క సుమన్ తనకు అత్యంత సన్నిహితుడని, చెన్నూర్లో అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే మరోసారి భారీ మెజార్టీతో దీవించాలని ప్రజలను కోరారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు చప్పట్లు.. ఈలలు.. కేరింతలు కొడుతూ నినాదాలతో హోరెత్తించారు. రోడ్షోకు వచ్చిన వారు డ్యాన్స్ చేయడంతో వారితో పాటు కేటీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకాని కూడాస్పెప్పులేసి జోష్ నింపారు. మధ్యాహ్నం 1.47 గంటలకు రోడ్ షో ముగించుకొని తిరిగి బయలుదేరి వెళ్లారు. కాగా, మంత్రి కేటీఆర్ రోడ్షో శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది.