గుడిపెల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఆరుగురు సజీవదహనమైన ఘటన పక్కా పథకం ప్రకారమే జరిగిందని పోలీసుశాఖ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. సింగరేణి ఉద్యోగి శాంతయ్య భార్య సృజననే.. తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి కుట్ర చేసినట్లు అవగతమవుతున్నది. తన భర్త శాంతయ్యతోపాటు వివాహేతర సంబంధం పెట్టుకున్న మాసు పద్మ, ఆమె భర్త శివయ్యను అంతం చేసేందుకు రూ.30 లక్షల విలువైన భూమిని సుపారీగా ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకొని వివిధ కోణాల్లో విచారణ వేగవంతం చేసిన పోలీసులు, సీన్ రీకన్స్ట్రక్షన్ తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశమున్నది.
మంచిర్యాల, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుగురి సజీవదహనం కేసులో తవ్వినకొద్ది కొత్తకోణాలు బయటపడుతున్నాయి. మం దమర్రి మండలం గుడిపెల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఆరుగురు సజీవదహనమైన ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని, పక్కా ప్లానింగ్తోనే చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృ తుడు, సింగరేణి ఉద్యోగి శాంతయ్యకు, మృతురాలు మాసు ప ద్మకు ఉన్న వివాహేతర సంబంధం, శాంతయ్య భార్య సృజన కుటుంబానికి, పద్మ కుటుంబానికి మధ్య ఉన్న ఆస్తి తగదాలు, సింగరేణి కారుణ్య నియామకం, రిటైరయ్యాక వచ్చే డబ్బు పంపకాల్లో వివాదాలే హత్యకు ప్రధాన కారణాలుగా తెలిసింది. అయితే గడిచిన నాలుగైదేళ్లుగా శాంతయ్య మాసు పద్మతో సహజీవనం చేస్తున్న నేపథ్యంలో ఆయన భార్య సృజన సైతం మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నట్లు సమాచా రం. ఆ వ్యక్తి (ప్రియుడి)తో కలిసే పక్కా పథకం ప్రకారం శాంత య్య, మాసు పద్మతో పాటు ఆమె భర్త శివయ్యను అంతం చేయాలని ఈ ఘాతుకానికి కుట్ర చేసినట్లు తెలిసింది.
శాంతయ్య, పద్మలను హత్య చేసేందుకు ఆయన భార్య సృజన, ప్రియుడు, బంధువులతో కలిసి లక్షెట్టిపేటకు చెందిన ఇద్దరికి సుపారీ ఇచ్చినట్లు తెలిసింది. మేడి లక్ష్మణ్, రమేశ్లకు రూ.30 లక్షల భూమిని సుపారీగా ఇచ్చేందుకు ఒప్పందం చేసుకొని, ఖర్చులకు రూ.2 లక్షలు ఇచ్చారని.. ఆ డబ్బులతోనే ఈ దారుణానికి వారు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో బయటికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ గ్యాంగ్లో రెండేళ్ల క్రితం (లాక్డౌన్ సమయంలో) గోదావరిఖనికి చెందిన రవికుమార్ను సుపారీ తీసుకొని హత్య చేసిన మేడి గంగరాజం, సా యి కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శాం తయ్య భార్య సృజన, ఆమె ఇద్దరు కుమారులు రాజ్కుమార్, దీపక్కుమార్, కూతురు మౌనిక, సృజన తండ్రి అంజయ్య, ఆమె ప్రియుడితో పాటు సుపారీ తీసుకున్న మేడి లక్ష్మణ్, రమేశ్, మేడి గంగరాజం, సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. వీరితో పాటు గుడిపెల్లికి చెందిన స్థానిక వ్యక్తిని కూడా విచారణకు తీసుకెళ్లినట్లు సమాచారం.
ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పథకం ప్రకారం హత్య చేశారనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు మొత్తం 16 టీమ్లను ఏర్పాటు చేసి కూపీ లాగుతున్నారు. ముందు శాంతయ్య భార్య సృజన, ఆమె తండ్రి, పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా గోదావరిఖని, చెన్నూరు, శ్రీరాంపూర్, మందమర్రి, మంచిర్యాల ప్రాంతాల్లోని అన్ని పెట్రోల్ బంకులు, వైన్స్ షాపుల సీసీ టీవీ పుటేజీలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో దారుణానికి పాల్పడిన వ్యక్తులు ఆటోలో వచ్చి శ్రీరాంపూర్లోని ఓ పెట్రోల్ బంక్లో 40 లీటర్ల పెట్రోల్ను డబ్బాల్లో నింపుతున్న దృశ్యాలు లభ్యమయ్యాయి. అనంతరం వారు ఓ వైన్ షాప్నకు వెళ్లి మద్యం తాగినట్లు కూడా సీసీ టీవీ పుటేజీ దొరికింది. ఈ మేరకు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య చేసిన విధానాన్ని తెలుసుకునేందుకు సీన్ రీ- కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఆదివారమే ఈ పని చేద్దామనుకున్నా మీడియా దృష్టి మొత్తం గుడిపెల్లి మీదే ఉండడంతో ఈ రోజు రాత్రి లేదా సోమవారం ఉదయం సీన్ రీ- కన్స్ట్రక్షన్ చేస్తారని తెలిసింది. అనంతరం రేపు ప్రెస్మీట్ పెట్టి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉంది.
ఇంట్లో, ఇంటి బయట పెట్రోల్ పోసి నిప్పు అంటించాక.. అందులో ఉన్న ఆరుగురు మాసు శివయ్య, పద్మ, శాంతయ్య, మౌనిక ఆమె పిల్లలు అరవలేదా.. తప్పించుకునే ప్రయత్నం చే యలేదా.. అనేది పెద్ద ప్రశ్నగా మారింది. స్థానికులు ఇల్లు కా లుతూ పెంకులు పలుగుతున్న శబ్ధాలకే తాము బయటికి వచ్చి చూశామని చెబుతున్నారు. తమకు ఎవరి అరుపులు, కేకలు వినిపించలేదు అంటున్నారు. అప్పుడు సమయం 12.30 అవుతుంది. అప్పటికే ఇల్లు దాదాపు కాలిపోయింది. ఈ నేపథ్యంలో ఆరుగురికి మత్తు మందు ఇచ్చారా లేక ముందే చంపేసి ఇంట్లో వేసి నిప్పు అంటించారా అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ విషయంలో పోలీసులు రేపు క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
మందమర్రి, డిసెంబర్ 18 : గుడిపెల్లిలోని సంఘటన స్థలాన్ని ఆదివారం బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్, మందమర్రి సీఐ ప్రమోద్రావుతో కలసి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏసీపీ ఎడ్ల మహేశ్, మందమర్రి సీఐ ప్రమోద్రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. శనివారం సెలవులో ఉన్న ఏసీపీ ఎడ్ల మహేశ్ విచారణలో భాగంగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మరికొన్ని గంటల్లో సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది.