ఎదులాపురం, జనవరి 20 : ఆర్ఎంపీల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా పూర్తి సహకారం అందించడంతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దృష్టికి తీసుకెళ్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. యాదవ సంఘం భవనంలో ఆర్ఎంపీ సొసైటీ క్యాలెండర్ను శుక్రవారం ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి విడుదల చేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఆర్ఎంపీలు ఎన్నో ఏండ్ల నుంచి సర్టిఫికెట్ల విషయమై పోరాటం చేస్తున్నారని చెప్పారు. అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు , సొంతింటి స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. ఆర్ఎంపీల సంఘ భవనం కోసం స్థలం కేటాయించి నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, డీసీసీబీ డైరెక్టర్ పరమేశ్వర్, అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామోజీ వీరాచారి, రాళ్ల బండి శంకర్, సభ్యులు కావటి రమేశ్, ఉమేశ్, బిక్కు పవార్, అశోక్, వెంకట్, భోజారెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, జనవరి 20 : సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ పండుగల విశిష్టతను తెలియజేసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సంక్రాతి పండుగను పురస్కరించుకొని స్థానిక తాలూకా మున్నూరుకాపు సంఘ భవనంలో నోములు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న-జోగు రమ దంపతులు హాజరయ్యారు. శ్రీలక్ష్మీదేవి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరుకాగా.. వారికి నోములు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షప్రధాన కార్యదర్శులు కాళ్ల విఠల్, కలాల శ్రీనివాస్, నాయకులు ప్రభ, బొడగం మమత, కస్తాల ప్రేమల, రాధ, పద్మ తదితరులు పాల్గొన్నారు.