దిలావర్పూర్, జూలై 6 : కాళేశ్వరం ప్యాకేజీ-27 నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లి రైతులకు వరంగా మారింది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మల్ నియోజకవర్గంలోని బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నది. గుండంపల్లి పరిసర ప్రాంతాల్లో నిర్మించిన కాలు వ రైతులకు లబ్ధి చేకూర్చుతున్నది. ఈ పనులు 2011లో ప్రారంభమైనా.. అనివార్య కారణాల వల్ల నిలిచాయి. స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రూ.750 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఇందులో భాగంగానే గుండంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ ఓపెన్ కాలువ రైతులకు లబ్ధి చేకూర్చుతున్నది. ఈ ఓపెన్ కాలువ ద్వారా 90 మంది రైతులు 247 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఒకప్పుడు తమ చేలలోని బోరు బావుల ద్వారా 3-5 ఎకరాల్లో సాగు చేసేవారు. నేడు 10-15 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. దీని పరిధిలో యేటా రెండు, మూడు పంటలు తీయడంతోపాటు కాలువ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయని రైతులు పేర్కొంటున్నారు. ఓపెన్ కాలువలో మోటర్లు ఏర్పాటు చేసి రెండు కిలో మీటర్ల మేర అండర్గ్రౌండ్ పైప్లైన్ వేసి పంటలకు నీరందిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతును రాజు చేస్తున్నదని చెప్పడానికి కాళేశ్వరం ప్యాకేజీ 27 ఓ ఉదాహరణ.
ఓపెన్ కాలువ ద్వారా కాళేశ్వరం నీరందుతోంది..
మా చేనుకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ప్యాకేజీ 27 ఓపెన్ కాలువ ఉంది. నాకున్న బోరుబావి ద్వారా నీరు సరిపోవడం లేదు. ఓపెన్ కాలువలో పెద్ద కుండ మోటర్ను ఏర్పాటు చేసి భూమిలో నుంచి పైప్లైన్ వేసి చేను వరకు తీసుకొచ్చా. దీంతో బటన్ నొక్కితే చాలు మూడు ఇంచుల మందం నీరు పోస్తున్నది. మండుటెండల్లోనూ పంటలు వేశా. కాళేశ్వరం ప్యాకేజీ 27 ఓపెన్ కాలువ మాకు వరంగా మారింది.
– దేవేందర్రెడ్డి, గుండంపల్లి, రైతు
తాగు నీళ్లకు ఢోకా లేకుంటైంది..
లక్షెట్టిపేట రూరల్, జూలై 6 : తెలంగాణ రాకముందు నీళ్లకు మస్తు తిప్పలపడ్డం. పొలాల పొంటి తిరిగేటోళ్లం. బావులు, బోర్ల కాడ బిందెలు వరుస పెట్టేటోళ్లం. పనులన్నీ ఇడిసిపెట్టుకొని గంటలకొద్దీ నిలబడేటోళ్లం. బిందెడు నీటి కోసం కొట్లాటలయ్యేటివి. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ తాగు నీళ్లకు ఢోకా లేకుండా చేసిండు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ నీళ్లిస్తున్నడు. పొద్దుగాల లేవంగనే సరిపడా నీళ్లస్తున్నయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ సల్లంగా ఉండాలె.
– శనిగారపు వినోద, రంగపేట
మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు..
సీసీసీ నస్పూర్, జూలై 6: మిషన్ భగీరథ పథకం ద్వారా నస్పూర్ మున్సిపాలిటీలో ఇంటింటికీ నీరందిస్తున్నాం. దాదాపు 20వేల పై చిలుకు ఇండ్లు ఉన్నాయి. 80 వేలకు పైగా జనాభా ఉంది. 11 వాటర్ ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మించి నీరు సరఫరా చేస్తున్నాం. 10 లక్షల 80 వేల లీటర్ల నీరు అందుబాటులో ఉంటుంది. ఇంటింటికీ నీరు అందించడానికి 189 కిలోమీటర్ల పొడువునా డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లు ఏర్పాటు చేశాం. రూ. 18 కోట్లతో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు, డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లు ఏర్పాటు చేశాం. మున్సిపాలిటీలో 17,248 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చాం.
మున్సిపల్ పరిధిలో మిగితా ఇండ్లకు సింగరేణి యాజమాన్యం సరఫరా చేస్తుంది. కొత్తగా నిర్మిస్తున్న ఇండ్లు, ఇప్పటికే నల్లా కనెక్షన్ ఇచ్చిన కుటుంబాలకు నీరు ఎక్కువగా అందించడానికి కృషి చేస్తున్నాం. ఇందుకు వాటర్ ట్యాంకులు నిర్మించాల్సి ఉంది. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. గతంలో కోల్బెల్ట్ నస్పూర్ ప్రాంతంలో ప్రజలకు తాగునీరు సక్రమంగా అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాడల్లో నీటి కోసం గొడవలు జరిగి పోలీస్స్టేషన్ వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు నాయకులు, ప్రజాప్రతినిధులు వాడల్లో తిరగలేని పరిస్థితి ఉండేది. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత తాగు నీటికి ఇబ్బందులు లేవు. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు.
– ఈసంపల్లి ప్రభాకర్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్