కాసిపేట, జనవరి 20 : పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ యాదయ్య పేర్కొన్నారు. శనివారం కాసిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పదో తరగతి గదిలోకి వెళ్లి బోర్డుపై విద్యార్థులతో లెక్కలు చేయించారు.
అనంతరం పదో తరగతి బోధించే ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాంబమూర్తి, ఉపాధ్యాయుడు రమణారెడ్డి ఉన్నారు.