మంచిర్యాల, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అతనో డిగ్రీ కళాశాల లెక్చరర్. సంతోషంగా ఉన్న ఆయన జీవితాన్ని కరోనా అతలాకుతలం చేసింది. దాదాపు రెండేళ్లు పని లేక.. చివరికి చెరుకు రసం విక్రయించి ఆర్థికంగా దొక్కుకున్నాడు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తూనే లెక్చరర్గా.. మరో వైపు సీజనల్ వ్యాపారిగా స్వయం ఉపాధి పొందుతున్నాడు. కష్ట.. నష్టాలనెదుర్కొని ఆదర్శంగా నిలుస్తున్న దొనబండకు చెందిన బొప్పనపల్లి రమేశ్పై ప్రత్యేక కథనం..
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండకు చెందిన బొప్పనపల్లి రమేశ్ పదేళ్లుగా ఓ డిగ్రీ కాలేజీలో లెక్చరర్(జువాలజీ)గా పని చేస్తున్నాడు. నెలకు రూ.20వేల జీతం. దానికితోడు తనకున్న మూడెకరాలు సాగు చేసుకుంటూ రంది లేకుండా బతికేటోడు. జీవితం హాయిగా సాగిపోతున్న సమయంలో కరోనా విజృంభించింది. జాబ్ లేదు. రెండేళ్లు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. వేరే ఉద్యోగం చేద్దామన్నా దొరకలేదు. ఉన్న వ్యవసాయం చేసుకుంటూ కష్టంగా నెట్టుకొచ్చాడు. ఈ క్రమంలో తన తమ్ముడు, నాన్న, మామయ్యలా చెరుకు బండి పెట్టుకుందామనే ఆలోచనకు వచ్చాడు. అలా ఆరు నెలలు లెక్చరర్గా, మరో ఆరు నెలలు చెరుకుబండి నడుపుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నాడు.
చెరుకు సాగు ఆలోచన వచ్చింది ఇలా..
పోయిన ఎండాకాలం రూ.2 లక్షలు పెట్టి చెరుకు రసం తీసే మిషన్ కొనుగోలు చేశాడు. రూ.లక్షతో ఆటో కొని, దానిలోనే రూ. 60 వేల విలువ చేసే బ్యాటరీని అమర్చాడు. మొత్తం రూ.3.60 లక్షలు ఖర్చు చేసి.. రూపొందించిన ఆటోను మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం గుడిపేట గ్రామ శివారులో ఉంచి.. చెరుకు రసం అమ్ముకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నాడు. అయితే చెరుకు మహారాష్ట్ర నాందేడ్, కర్ణాట క రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాలి. లోకల్ చెరుకైతే కోరుట్ల నుంచి తెచ్చుకోవాలి. అలా అయితే కిలోకు రూ.7 చొప్పున టన్నుకు రూ.7 వేలు అవుతుంది. తమ్ముడు, నాన్న, మామయ్య, రమేశ్కు కలిపి నాలు గు బండ్లు ఉన్నాయి. లోడ్ చెరుకు వేసుకుంటే రూ.21 వేలతో పాటు మరో రూ.7 వేలు కిరాయి అవుతుంది. ఇలా మొత్తం ఒక్క లోడ్కు రూ.28 వేల దాకా పెట్టుబడిపెట్టాల్సి వస్తుంది. ఆ లెక్కన 20 ట్రిప్పుల కు రూ. లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక మిగిలేది ఏమీ ఉండదు. గతేడాది కోరుట్లకు లోడ్ తెచ్చుకునేందుకు పోయినప్పుడు చెరుకు సాగు గురించి తెలుసుకున్నాడు. ఇంటర్నెట్లో సెర్చ్ చేసి, స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం అధికారుల సహకారంతో స్వయంగా పంట సాగు చేస్తున్నాడు. 8 నెలల్లో అది అద్భుతంగా పెరిగింది. మరికొద్ది రోజుల్లో చెరుకు జ్యూస్కు డిమాండ్ ఉంటుంది. ఆ సమయంలో దాన్ని కోయనున్నాడు.
ఆరు నెలల్లో రూ.4 లక్షల ఆదాయం పక్కా..
రమేశ్కు మూడెకరాలు ఉండగా, అందులో అర ఎకరంలో చెరుకు సాగు చేశాడు. ఇందుకు పెట్టుబడి, ఎరువులు ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.30 వేల దాకా అయ్యింది. అర ఎకరంలో 20 టన్నుల దిగుబడి రానుంది. అంటే టన్నుకు రూ.7000 వేసుకున్నా రూ.1,40,000 మిగిలినట్లే. రాబోయే ఆరు నెలల్లో ప్రతి రోజూ 100 గ్లాస్లు విక్రయిస్తాడట. గ్లాస్కు రూ.20 వేసుకున్నా ఆ లెక్కన రూ.2 వేలు వస్తాయి. బండి డీజిల్కు రూ.300 తీసేసినా ఆరు నెలలకు రూ.3 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. చెరుకు కొనుగోలు చేసే అవసరం లేదు కాబట్టి ఆ రూ.1.40 లక్షలు కలుపుకొని ఆరు నెలల్లో రూ.4 లక్షలు పక్కాగా మిగులుతాయని రమేశ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నా ప్లానింగ్లో తేడాలేదు. ఆదాయంలో అసలే ఉండదని చెబుతున్నారీ లెక్చరర్. ‘గతేడాది ఓ 15 రోజులు తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటకలో చెరుకు దొరక్క వ్యాపారాలు సాగలేదు. ఎప్పుడైతే చెరుకు దొరకదో అప్పుడు నాతోటలో కోసుకెళ్తా. నాతో పాటు నాన్న, తమ్ముడు, మామయ్య బండ్లకు కూడా కొంత ఇస్తా. అలా చేస్తే నాతో పాటు వాళ్లకు కూడా పని ఉంటుంది. జూన్ వరకు బండి నడిపించి ఆ తర్వాత మా కాలేజీలో లెక్చర్(కేవలం సెలబస్ పూర్తిచేయడం)గా తిరిగి జాయిన్ అవుతా. వర్షాకాలం, చలికాలం చెరుకు రసానికి సీజన్ ఉండదు. ఆ సమయంలోనే నాకు కాలేజీలో సెలబస్ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని కరోనాలు వచ్చినా ఏం కాదు’ అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.