సోన్, అక్టోబర్ 10 : వానకాలంలో సాగు చేసిన వరి పంట మొన్నటి వరకు మురిపించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండడంతో వాతావరణంలో మార్పులతో వరి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. యూరియాను అధిక మోతాదులో వాడడంతో దీనికి కారణమంటున్నారు వ్యవసాయశాఖ అధికారులు. సెప్టెంబర్- అక్టోబర్ నెలలో మబ్బులతో కూడిన వాతావరణం, రెండు, మూడు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలు, తక్కువ ఉష్ణోగ్రతలు, తదితర పరిస్థితులు వరిలో ఆకు ఎండుతెగులు ఆశించడానికి దోహదం చేస్తాయి.
నారు మడి దశ నుంచి గింజ పాలు పోసుకునే వరకు తెగులు ఆశించే అవకాశం ఉండడం, చెట్టు నీడ పడే ప్రదేశంలో ఎక్కువగా ఆకుఎండు తెగులు ఆశించి మిగిలిన పంటకు వేగంగా వ్యాప్తిస్తోంది. నిర్మల్, సోన్ మండలంలోని వెంగ్వాపేట్, లంగ్డాపూర్, చిట్యాల్, డ్యాంగాపూర్, నీలాయిపేట్, మేడిపెల్లి, సోన్, న్యూవెల్మల్ బొప్పారం, సిద్దులకుంట, పాక్పట్ల, కూచన్పెల్లి, కడ్తాల్, సాకెర గ్రామాల్లోని రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. అయితే ఈ వానకాలంలో ఎక్కువగా సన్నరకం వంగడాలను సాగు చేయడం వల్ల ఈ రకానికి ఎక్కువగా తెగుళ్లు వచ్చే అవకాశం ఉంది. రైతులు సస్యరక్షణ చర్యలు చేపడితే దిగుబడులు సాధించుకోవచ్చని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
వరి పంటలో ఆకుఎండు తెగులు సోకిన ప్రదేశంలో ముందుగా ముదురు ఆకులకు పసుపు రంగు మచ్చలు ఏర్పడి పైనుంచి కింది అంచుల వెంబడి వ్యాపించి ఎండుతూ వస్తాయి. ఉదయం సమయంలో గమనిస్తే ఆకుల మీద పసుపు రంగు జిగురు ముద్దలు కనబడతాయి. ఎండ వేడిమికి గట్టిపడి రాలిపోతాయి. ఈ ఎండిన బ్యాక్టీరియా ముద్దలు నీటి ద్వారా వెళ్లి మిగిలిన పంటకు వ్యాప్తిస్తోంది.
బ్యాక్టీరియా వ్యాప్తి నివారణకు తెగులు సోకిన మొక్కల నుంచి ఆరోగ్యకరమైన పంటకు నీరు పారకుండా చూసుకోవాలి. తెగులు ఆశించిన పొలంలో యూరియాను వేయకూడదు. కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు, ప్లాంటోమైసిన్ 4 గ్రాములు, లేదా పోషామైసిన్ లేదా స్పైప్లోసైక్లిన్ నాలుగు గ్రాములు పది లీటర్ల నీటిలో కలిపి 2-3సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేయాలి.