బాసర, మే 31 : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ను ఇన్చార్జి వైస్చాన్స్లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్ బుధవారం విడుదల చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు, నాన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, జడ్పీ హైస్కూల్, మున్సిపల్ హైస్కూల్, సాంఘిక సంక్షేమ మోడల్ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు 0.4 జీపీఏ కలపనున్నారు. ట్రిపుల్ ఐటీలో 85 శాతం సీట్లను స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కేటాయించారు. అలాగే గ్లోబల్ కేటగిరీలో ఇతర రాష్ర్టాల వారికి 5 శాతం, ఎన్ఆర్ఐ కోటాకు 2 శాతం సీట్లను కేటాయించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 371 ఆర్టికల్ డీ సెక్షన్ 95, 2014 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ట్రిపుల్ ఐటీలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సంబంధిత కేటగిరీలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు సాధించిన జీపీఏ సమానమైతే వరుసగా గణితం, సైన్స్, ఇంగ్లిష్ , సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే విద్యార్థి పుట్టిన తేదీ ప్రకారం ఎవరు పెద్దవారైతే వారికి సీటును కేటాయించనున్నారు. ఇవి కూడా సమానంగా ఉంటే. పదో తరగతి విద్యార్థి హాల్టికెట్లో రాండామ్ ఎవరికి తక్కువ ఉంటే వారికి ఎంపిక చేస్తారు.
ఆన్లైన్లో దరఖాస్తులో సమర్పించేటప్పుడు ఇచ్చిన రసీ దు, మార్కుల జాబితా, నివాస సర్టిఫికెట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు, దివ్యాంగులైతే వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్, సైనిక ఉద్యోగ పిల్లలైతే అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు వాటికి సంబంధించి అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మూడు హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చు సంబంధిత నంబర్లు. 7416002245, 7416058245, 7416122245.
బాసర ట్రిపుల్ ఐటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో భాగంగా మొదటి, రెండు సంవత్సరాలు పీయూసీ-1, పీయూసీ -2 ఉంటుంది. మిగతా నాలుగేండ్లు బీటెక్ ఇంజినీరింగ్ విద్యావిధానం ఉంటుంది. ప్రతి యేడాది మొదటి రెండు సంత్సరాలు పూర్తయిన తర్వాత కొందరు విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్లి ఇతర కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. అలా వెళ్లడం వల్ల బీటెక్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. అయితే ఈ ఏడాది సీట్లను భర్తీ చేసేందుకు వీలుగా ప్రభుత్వ అనుమతితో ఒక కమిటీ వేశామని, త్వరలోనే కమిటీ నిర్ణయాల మేరకు ఖాళీ సీట్లను భర్తీ చేస్తామని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణ అన్నారు. ఈ సీట్లను గ్లోబల్ కేటగిరీ కింద భర్తీ చేసి యేటా 1.37 లక్షలు విద్యార్థి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్, అడ్మిషన్ కో-ఆర్డినేటర్లు, అడ్మిషన్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10, బీసీ – ఏ 7, బీసీ – బీ 10, బీసీ – సీ 1, బీసీ – డీ 7, బీసీ -ఈ 4 శాతం.
ప్రత్యేక కేటగిరీలో దివ్యాంగులకు 3 శాతం, సైనిక ఉద్యోగుల పిల్లలకు 1 శాతం, స్పోర్ట్స్ వారికి 0.5 శాతం, అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతం ద్వారా భర్తీ చేయనున్నారు.
2022-23 విద్యాసంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిసెంబర్ 31, 2023 నాటికి 18 ఏళ్లు మించకూడదు ,ఎస్సీ, ఎస్టీలకు 21 ఏళ్లు నిండకూడదు.
టీఎస్ ఆన్లైన్, మీ సేవ కేంద్రాలు admissions@rgukt.ac.in వెబ్సైట్ ద్వారా జూన్ 5 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పీహెచ్, స్పోర్ట్స్, క్యాప్, ఎన్సీసీ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు పత్రాలను జూన్ 24 వరకు పంపించాలి. ఎంపికైన విద్యార్థుల జాబితాను జూన్ 26న విడుదల చేస్తారు.
ఓసీ, బీసీ విద్యార్థులకు ఆప్లికేషన్ ఫీజు రూ. 500, ఎస్సీ, ఎస్టీలు రూ. 450 చెల్లించాలి.
గ్లోబల్ కేటగిరీ వారు రూ. 1500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి
రాష్ట్రంలోని పాఠశాలలో చదివిన విద్యార్థులకు రూ. 37 వేలు చెల్లించాలి ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. ఓసీ, బీసీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 500 చొప్పున, మెడికల్ ఇన్సూరెన్స్ ఫీజు రూ. 700 చెల్లించాలి. ఇతర రాష్ర్టాల విద్యార్థులకు రూ. 1.37 లక్షలు చెల్లించి దరఖాస్తు ద్వారా అడ్మిషన్ పొందవచ్చు.