చింతలమానేపల్లి, జనవరి 10 : సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సహకారంతో మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామంలో రైతు నేస్తం కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎడ్లబండ్ల పరుగు పందేలు నిర్వహించారు. ఈ పోటీలకు అనూహ్య స్పందన లభించింది. ఎమ్మెల్యే కోనప్ప స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో మొట్టమొదటి సారిగా పరుగు పందేలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ఎడ్ల పందేలు నిర్వహించేలా చూడాలని కమిటీ సభ్యులను కోరారు. ఈ పందేలకు మొత్తం 22 జతలు పాల్గొనగా దహెగాం మండల ఐనం గ్రామానికి చెందిన బోయిరే తులసీ రాం ఎద్దులు మొదటి స్థానంలో, ఇట్యాల గ్రామానికి చెందిన అక్షయ్ ఎద్దులు రెండో స్థానంలో నిలిచాయి.
ఎంపీపీ డబ్బుల నానయ్య, జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా అరతులం బంగారం, రెండో బహుమతి చుక్కెత్తు బంగారం ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచు రౌతు సుజాత, ఉపసర్పంచ్ భాగ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డుబ్బుల వెంకయ్య పాల్గొన్నారు. నియోజక వర్గ స్థాయిలో నిర్వహించిన పందేలను వీక్షించేందుకు సుమారు 5 వేల మంది తరలివచ్చారు. ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, వెంకటేశ్, ఏఎస్ఐ యాదవ్ బందోబస్తు నిర్వహించారు.