ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. 10 నియోజకవర్గాల్లోని 2,857 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఎన్నికలు నిర్వహించగా, ప్రజలు తరలివచ్చి ఓటేసేందుకు ఆసక్తి చూపారు. సమస్యాత్మక నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, సిర్పూర్లో పోలింగ్ గంట ముందే ఉదయం 7 గంటలకు ప్రారంభించి.. సాయంత్రం 4 గంటలకే ముగించారు.
సాయంత్రం 4 గంటల్లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చినవారందరికీ ఓటు వేసే అవకాశమిచ్చారు. ఇక ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం కాస్త మందకొడిగా సాగగా, మధ్యాహ్నం తర్వాత ఓటర్ల రాక పెరిగింది.
సాయంత్రం ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ఒకటీ.. రెండు ఘటనలు తప్ప.. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నది. ఇక 3న ఓట్లు లెక్కించనుండగా, అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.