బోథ్ : గత పాలకుల 70 ఏండ్ల పాలనలో సాధించనిది సీఎం కేసీఆర్ నేతృత్వంలో 7 ఏండ్లలో అభివృద్ధిని సాధించామని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వీ గంగాధర్గౌడ్ తెలిపారు. శుక్రవారం బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ సమావేశం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రంలో వైఫల్యాలు కనిపించక కుటుంబ పాలనంటూ కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నాయని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి, ముగ్గురు ఎంపీలున్న తెలంగాణలో రాష్ట్రానికి ఏమి తీసుకొచ్చారో ప్రజలకు తెలపాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని పథకాలను ప్రవేశ పెట్టిందో ప్రజల కండ్ల ముందు కనిపిస్తుందన్నారు. జాతీయ పార్టీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, మరో ఇరవై ఏండ్లు టీఆర్ఎస్ దే అధికారమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లలో సాధించిన ప్రగతిని నివేదించడానికే వరంగల్లో విజయగర్జన సభ ఏర్పాటు చేసినట్లు , ప్రతీ కార్యకర్త, నాయకుడు విజయ గర్జనకు తరలిరావాలన్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ…నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి పథకం కోసం 18,932 దరఖాస్తులు రాగా 14,228 మందికి రూ 124 కోట్లక ఆర్థిక సాయం ప్రభుత్వం అందించిందన్నారు.
టీఆర్ఎస్ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందనే వారికి ఈ ఒక్క పథకం గణాంకాలు చాలన్నారు. సమావేశంలో బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, పార్టీ మండల కన్వీనర్ ఎస్ రుక్మణ్సింగ్, జడ్పీటీసీ డాక్టర్ ఆర్ సంధ్యారాణి, సర్పంచ్ సురేందర్యాదవ్, ఎఎంసీ చైర్మన్ దావుల భోజన్న, ఆత్మ చైర్మన్ సుభాష్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ, మండల కమిటీలు, అనుబంధ కమిటీలు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.