ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగ నదీ పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను దళారులు అక్రమంగా రవాణా చేస్తున్నారు. జేసీబీలతో తవ్వుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రవాణాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు తమ బాధ్యత కాదంటూ వ్యవహరిస్తున్నారు. జైనథ్ మండలంలోని పెండల్వాడ, ఆనంద్పూర్, డొల్లార, కౌఠ, సాంగ్వి.. భీంపూర్ మండలంలోని వడూర్, తాంసి(కే), గొల్లఘాట్, గుబిడి.. బేల మండలంలోని సాంగిడి గ్రామ పరిసరాల తరలిస్తున్నారు. వందల ట్రాక్టర్లు, టిప్పర్లలో రవాణా చేస్తూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. రవాణాను అడ్డుకోవాలని అధికారులను కోరినా ఫలితం లేదని స్థానిక గ్రామాలవాసులు పేర్కొంటున్నారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 17 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది వానకాలం కురిసిన భారీ వర్షాలతో పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లో భారీగా ఇసుక నిల్వలు పేరుకుపోయాయి. దీన్ని అవకాశంగా మార్చుకున్న దళారులు అక్రమ దందాకు తెరలేపారు. జిల్లాలో జైనథ్ మండలం పెండల్వాడ, డొల్లార, కౌఠ, సాంగ్వి, బేల మండలం సాంగిడి, భీంపూర్ మండలం వడూర్, తాంసి(కే), గొల్లఘాట్, గుబిడి గ్రామాల్లోని పెన్గంగ ప్రవాహం కొనసాగుతున్నది. వర్షాకాలంలో నది నిండుగా ప్రవహించడంతో ఇసుక మేటలు భారీగా పేరుకుపోయాయి. జిల్లాలో ఇసుక క్వారీలకు అవకాశం లేదని, నది పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తే రైతులు, స్థానికులకు నష్టం జరుగుతుందని భూగర్భజల వనరుల శాఖ అధికారులు గతంలో కలెక్టర్కు నివేదికలు ఇచ్చారు. నది ప్రవహించే చోట భూమి నుంచి రెండు మీటర్ల పైనే ఇసుక నిల్వలుంటే అనుమతులు లభిస్తాయి. జిల్లాలో పెన్గంగ నది పరీవాహక ప్రాంతాల్లో రెండు మీటర్ల లోపు ఇసుక పేరుకొని ఉంటుంది. ఈ నది పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను తోడితే భూగర్భజలాలు ఇంకిపోతాయి. రైతులకు సాగునీటి సమస్యలు ఎదురవుతాయి. దీంతో ఇసుక తవ్వకాలు జరిపే అవకాశం లేకపోవడంతో క్వారీలకు అనుమతులు లభించలేదు.
భారీగా తవ్వకాలు..
జిల్లాలో ప్రైవేట్ భవనాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఇసుక అవసరం ఉంటుంది. మహారాష్ట్రలో ఇసుక కొరత కారణంగా జిల్లాలో లభ్యమయ్యే ఇసుకకు అక్కడ మంచి డిమాండ్ ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో క్వారీలకు ఎలాంటి అనుమతులు లేకపోగా, అధికారిక పనులకు కాంట్రాక్టర్లు మంచిర్యాల జిల్లా గోదావరి నుంచి ఇసుకను తీసుకొస్తారు. యథేచ్ఛగా రవాణాచేస్తూ ప్రైవేట్ భవనాలు, ఇతర నిర్మాణాలకు అవసరమైన ఇసుకను పెన్గంగ ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తారు. దళారులు ఒక్కో క్వారీని రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు దక్కించుకుంటారు. జేసీబీల ద్వారా నాలుగు మీటర్ల మేర తవ్వకాలు సాగిస్తున్నారు.
ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రకు రోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్, టిప్పుర్ల ద్వారా ఇసుక రవాణా కొనసాగుతున్నది. వాహనాల రాకపోకల కోసం తాత్కాలిక రోడ్లను నిర్మించుకున్నారు. ఇసుక తీసుకుపోయే ప్రాంతంలో దళారులు నలుగురిని కాపలా ఉంచుతారు. ఒక్కో ట్రాక్టర్కు రూ.400 నుంచి రూ.500 వసూలు చేస్తారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి నిర్వహించిన వేలంలో కంటే రెండింతలు సంపాదిస్తారు. నవంబర్ మొదటి వారంలో ప్రారంభమైన ఇసుక అక్రమ తవ్వకాలు జూన్ వరకు కొనసాగుతాయి. కొందరు దళారులు నది నుంచి తీసుకొచ్చిన ఇసుకను భారీగా డంప్ చేసి విక్రయిస్తారు. వానకాలంలో అధిక ధరలకు విక్రయిస్తారు. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భజలాలు అండుగంటి పోతున్నాయి. దీంతో గ్రామాల్లోని రైతులకు సాగునీరు, స్థానికులకు తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
బాధ్యత ఎవరిది?
గతంలో ఇసుక అక్రమ రవాణా నిరోధా నికి రెవెన్యూ, మైనింగ్ అధికారులు బృందాలుగా ఏర్పడి తవ్వకాలు చేయకుండా చూసేవారు. ప్రస్తుతం మైనింగ్, రెవెన్యూ శాఖల అ ధికారుల ఇసుక రవాణాను అడ్డుకోవడం తమ బాధ్యత కాదంటున్నారు. మైనింగ్ అధికారులు వాల్టా, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ ప్రకారం రెవె న్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని పే ర్కొంటున్నారు. ఇసుక రవాణాను అడ్డుకోవాల్సింది మైనింగ్ శాఖ అధికారులనేనని, ఇం దుకు సంబంధించిన జీవోలు సైతం ఉన్నాయ ని, తాము ఇతర పనుల్లో బీజీగా ఉంటామని రెవెన్యూ శాఖ అధికారులు అంటున్నారు.