పెన్పహాడ్, మే 22 : తనను మానసిక, భౌతిక వేధింపులకు గురి చేసిన అత్త వారింటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఓ మహిళ సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెన్పహాడ్ మండలం మోర్సకుంట తండాకు చెందిన అంజలి, చిలుకూరు మండలం కొమ్ముబండ తండాకు చెందిన బానోతు జగన్కు మూడేండ్ల క్రితం వివాహం జరిగింది. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇరువురు అరుణాచల్ ప్రదేశ్లో ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో ఇంటికి వచ్చారు. కాగా అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త, మామా, ఆడబిడ్డ, మరిది తనను వేధిస్తున్నట్లు అంజలి తెలిపింది. మూడు నెలల గర్భవతి అని కూడా చూడకుండా వారు ఇష్టం వచ్చినట్లు కొట్టగా తనకు గర్భస్రావం అయితే డాక్టర్ సర్టిఫికెట్తో పెన్పహాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పింది.
నెలలు గడుస్తున్నా ఎస్ఐ చర్యలు తీసుకోకపోగా తన అత్తింటి వారికే మద్దతు పలుకుతున్నట్లు ఆరోపించింది. అంతేకాకుండా ఎస్ఐ తన ఆడబిడ్డ మాటలు విని తన భర్తను బామ్మర్ధిగా సంబోదిస్తూ వారికి పూర్తి అండగా నిలుస్తూ తనకు అన్యాయం చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే అదనపు కట్న వేధింపులకు పాల్పడి, భౌతిక దాడులు చేసి తన గర్భ విచ్ఛితికి కారణమైన అత్తింటి వారందరిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా బాధిత మహిళ ఎస్పీని కోరింది.