మంచిర్యాల అర్బన్, మార్చి 6 : మంచిర్యాల మున్సిపాలిటీలోని రంగపేట శివారులోగల అటవీప్రాంతంలో అక్రమ దందా జోరుగా సాగుతున్నది. కొందరు.. ఏసీసీ ర్యాలీ గఢ్పూర్ గుట్టలను అడ్డాగా చేసుకొని మట్టి, బండరాళ్లను తొలగిస్తూ యథేచ్ఛగా తరలిస్తున్నారు. గత నెల 27న ‘నమస్తే తెలంగాణ’లో ‘రాళ్ల వాగులో దొంగలు’ పేరిట కథనం ప్రచురించగా, మకాం మార్చిన అక్రమార్కులు ప్రస్తుతం ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు.
సర్కారు ఆదాయానికి గండి..
జైపూర్ మండలంలో తప్ప.. ఎక్కడా అ ధికారికంగా మట్టి తీసే క్వారీలేదు. అలాగే రాళ్లకు సంబంధించి జిల్లాలో ఒక్క క్వారీకీ అనుమతి లేదు. దీంతో అక్రమార్కులు అం దుబాటులో ఉన్న గుట్టలు, చెరువులు, అటవీ ప్రాంతాల నుంచి గుట్టు చప్పుడు కా కుండా మట్టి తవ్వకాలు, బండరాళ్ల దందా కొనసాగిస్తున్నారు. అధికారులకు ఎంతో కొంత ముట్టచెబుతూ.. లక్షల్లో సంపాదిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంతో గుట్టలు, వాగులు కనుమరుగై పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ప్ర భుత్వ ఆదాయానికీ గండి పడుతున్నది.
పగలు, రాత్రి తేడా లేకుండా..
ఆయా ప్రాంతాల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా పొక్లెయినర్ల ద్వారా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. నిన్న మొన్నటి దాకా వాగుల నుంచి మట్టి, బండరాళ్లను తరలించుకుపోయిన వ్యాపారులు.. ఇప్పు డు చడీచప్పుడు కాకుండా అటవీ భూములపై పడ్డారు. ఇదంతా అధికారుల కనుసన్నుల్లోనే జరుగుతున్నట్లు పలువురు బాహాటంగానే మాట్లాడుకోవడం గమనార్హం.
అనుమతి తప్పనిసరి
ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాంతాల్లో ఉన్న మట్టి, గ్రానైట్ తీసేందుకు మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి. నిర్ధేశిత రుసుం చెల్లించిన తర్వాతే తరలింపు చేపట్టాలి. అనుమతులు లేకుండా అక్రమదందా నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. పట్టుబడ్డ వాహనాలు, యంత్రాలను స్వాధీనం చేసుకుంటాం. అక్రమ దందా జరుగుతుంటే పోలీసు, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులకు సమాచారం అందించాలి.
– బాలు నాయక్, మైనింగ్ ఏడీ, మంచిర్యాల