బాసర, సెప్టెంబర్ 13 : ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వీసీ వెంకటరమణకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం కామన్ రిక్రూట్మెంట్ బోర్డుపై మంత్రితో వీసీ చర్చించారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో భాగంగా విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలన్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు. యూనివర్సిటీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.., ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకులు, ఉద్యోగుల సంఖ్యను మంత్రులు వీసీ నుంచి తెలుసుకున్నారు. ఈ ఏడాది నూతనంగా చేరే విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. ఆర్జీయూకేటీకి ప్రభుత్వ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మంత్రులు హామీచ్చారు. వచ్చే వారంలో నూతన అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొత్తగా చేరే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మంచిగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆర్జీయూకేటీలో తీసుకుంటున్న చర్యలపై అధికారులను మంత్రులు అభినందించారు.
మంత్రి ఐకేరెడ్డికి ఆహ్వానం..
బాసర ట్రిపుల్ఐటీని సందర్శించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని వీసీ వెంకటరమణ ఆహ్వానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆయనను కలిసి విన్నవించారు. క్యాంపస్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి.. త్వరలోనే సందర్శించి, తన వంతుగా సాయం చేస్తానని హామీ ఇచ్చారని వీసీ తెలిపారు.