మాతృత్వం అనేది ఒక వరం.. ‘అమ్మానాన్న’ అనే పిలుపు కోసం భార్యాభర్తలిద్దరూ ఎదురు చూస్తుంటారు. ఇంట్లో, తమ జీవితాల్లో సందడి నింపే పిల్లల కోసం ఎన్నో కలలు కంటుంటారు. అయితే సంతాన భాగ్యానికి నోచుకోని జంటల వేదన వర్ణణాతీతం. అలాంటి వారిలో కొందరు పిల్లల దత్తత వైపు చూస్తున్నారు. ఇది అనాథలుగా మారిన పసిబిడ్డలకు కొత్త జీవితాన్ని ఇస్తుండగా, శిశు గృహల్లో అధికారికంగా ఈ తంతు నిర్వహిస్తున్నారు. చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తకుండా ఆయా జంటలు పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. ఆ పిల్లల ఆలనాపాలన చూసుకుంటూ మురిసిపోతున్నారు.
ఎదులాపురం, మే 17: కుటుంబంలో పిల్లలు ఉంటే సందడే వేరు. ఇటు దంపతులు తమ పిల్లలతో, అటు వృద్ధులు తమ మనుమలు, మనుమరాళ్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. అమ్మతనం అనేది ప్రతి వివాహిత జీవితంలో ఓ అమూల్య వరం. దీని కోసం ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేస్తుంటారు. దవాఖానల్లో వివిధ చికిత్సలు కూడా తీసుకుంటుంటారు. ఇక ఏదైనా కారణాలతో సంతాన భాగ్యానికి నోచుకోని వారి వేదన మాటల్లో చెప్పలేనిది. ఇలాంటప్పుడే దత్తత అనే అంశం తెరమీదకు వస్తుంది. తమ సమీప బంధువుల పిల్లలను కొందరు దత్తత తీసుకుంటుంటారు. మరికొంద అనాథ పిల్లలను పెంచుకునేందుకు సిద్ధమవుతుంటారు. ఇది వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపుతుంది. అనాథల పాలిట ఆశాదీపాలై కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వారి ఆలనా పాలన చూసుకుంటుంటారు.
పాన్ కార్డు, ఆధార్ కార్డు(ఇద్దరి), పుట్టిన తేదీ, జనన ధ్రువీకరణ పత్రాలు, – బోనోఫైడ్(ఇరువురివి), వివాహ ధ్రువీకరణ పత్రం, విడాకులపత్రం, మరణ ధ్రువీకరణ పత్రం (ఒంటరి), ఆదాయ ధ్రువీకరణ పత్రం (రూ.లక్షకుపైన), మెడికల్ ఫిట్నెస్, నివాస ధ్రువీకరణ పత్రం, ఫొటోలు(జంటగా) ఉండాలి. ముందుగా cara.nic.inలో parent login.online registrationలో దరఖాస్తు పూర్తి చేసి పైవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. దరఖాస్తులో ఇచ్చిన వివరాలు, ధ్రువీకరణ పత్రాల వివరాలు ఒకే విధంగా ఉండాలి. మీకు నచ్చిన జెండర్(ఆడ,మగ)ని ఎంచుకొనే అవకాశం ఉంది. అలాగే మీకు నచ్చిన 3 రాష్ర్టాల్లోనూ ఎంచుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా సరే అనుకుంటే anywere అనే అష్షన్ ఉంటుంది. లేకుంటే ఒక రాష్ట్రం మాత్రమే అని కూడా పెట్టుకోవచ్చు . మనం పెట్టుకునే పరిధిని బట్టి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే దూరం వెళ్లే పరిస్థితులు కూడా ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు progject director ap20saaని ఎంచుకోవాలి. దరఖాస్తు తర్వాత నెలరోజుల లోపు బాలల సంరక్షణ విభాగం నుంచి(ఐసీపీఎస్) సిబ్బంది దత్తత కేర్టేకర్ , తల్లిదండ్రుల ఇంటికి వచ్చి దర్యాప్తు చేసి వారి నివేదిక కారాలో పొందుపరుస్తారు. అప్పటి నుంచి వారికి సీనియారిటీ మొదలవుతుంది. దత్తత పొందాలననేవారు వారి వయసు బట్టి పిల్లల వయసు నిర్ధారించబడుతుంది. తల్లిదండ్రుల వయసును బట్టి పిల్లలను నిర్ణయిస్తారు. ఒంటరి మహిళలు(40-55 ఏండ్ల) కూడా దత్తత తీసుకోవచ్చు. బాయ్, గర్ల్ ఎవరినైనా తీసుకునే అవకాశం ఉంటుంది. ఒంటరి పురుషుడికి మాత్రం మగ పిల్లాడినే దత్తత ఇస్తా రు. దరఖాస్తు పూర్తయిన తర్వాత తమ ధ్రువీకరణ పత్రాలను(ఎస్ఏఏ)స్పెషలైజెడ్ ఆడాష్షన్ ఏజెన్సీకి అందే విధంగా చూడాలి . వాటితోపాటుగా పీడీడబ్ల్యూఅండ్ సీడీఏ- ఆదిలాబాద్ పేరిట తీసిన రూ.6వేల డీడీని శిశు గృహమేనేజర్కు అందజేయాల్సి ఉంటుంది.
తమ సీనియారిటీ మొదలైన తర్వాత యూజర్ఐడీ, పాస్ వర్డ్తో కారాలో లాగిన్ అయి నంబర్ని చెక్ చేస్తూ ఉండాలి. నంబర్ వచ్చినప్పుడు మీరు దరఖాస్తులో పొందుపరిచిన ఫోన్ నంబర్కు మెసెజ్ వస్తుంది. సందేశం అందిన 48 గంటల్లోపు బాబు, పాపను రిజర్వు చేసుకొని కింద వచ్చిన అడ్రస్లో సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. రిజర్వు చేసుకున్న 20 రోజుల్లో పిల్లలను ఏజెన్సీ వారు ఇస్తారు. ఏజెన్సీ వారికి నిజ ధ్రువీకరణ పత్రాలు, హామీపత్రాలతో పాటు రూ.50 వేల డీడీని అందజేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 2 నెలల్లోపు కోర్టు ద్వారా పిల్లలను కుటుంబానికి చట్టబద్దంగా అప్పగిస్తారు. పిల్లల యొక్క జనన ధ్రువీకరణ పత్రాన్ని ఏజెన్సీ అందజేస్తుంది. ఆ తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ఏజెన్సీ ప్రతినిధులు దత్తత తీసుకున్న పిల్లల బాగోగులు చూసేందుకు వస్తారు. అలా వారికి రూ.2వేలు చొప్పున ప్రతి 6 నెలలకు చెల్లించాల్సి వస్తుంది. నివాసం మారినా, ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినా ఏజెన్సీకి తప్పకుండా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20 సీసీఐ (చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్) ఉన్నాయి. ఇందులో 6 నుంచి 18 ఏండ్ల ఆడ పిల్లలు బాలసదనాల్లో, మగ పిల్లలు సీసీఐలో ఉంటారు. ఆదిలాబాద్లో 3, నిర్మల్ 1 ఆసిఫాబాద్లో1 మంచిర్యాలలో 15 ఉన్నాయి.
దత్తత చట్టబద్ధం. అనుమతి లేకుండా పిల్లల క్రయవిక్రయాలు చేస్తే శిక్షర్హులు అవుతారు. ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను కొనసాగిస్తున్నది. అనాథ పిల్లల సంరక్షణకు కూడా పలు విభాగాల ద్వారా కృషి చేస్తున్నది.
దత్తత ప్రక్రియ ద్వారా పిల్లలకు మంచి భవిష్యతు ఉంటుంది. కేంద్రం ఇందుకోసం చట్టబద్ధమైన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తి ధ్రువీకరణ తర్వాతే పిల్లలను అప్పగిస్తారు. కొన్ని కారణాలతో పిల్లలను పెంచుకోలేని వారు కూడా శిశుగృహను సంప్రదిస్తారు. అలా ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. నిబంధనలకు అనుగుణంగానే దత్తత ప్రక్రియ కొనసాగుతుంది. చట్టవిరుద్ధంగా దత్తత తీసుకునే అవకాశం లేదు.
– రాజేంద్రప్రసాద్, జిల్లా బాలల సంరక్షణ అధికారి, ఆదిలాబాద్
పిల్లల్ని దత్తత తీసుకోవడమనేది దంపతుల్లో ఏ ఒక్కరికో ఉంటే సరిపోదు. ఇద్దరూ మనస్ఫూర్తిగా ఏకాభిప్రాయానికి రావాలి. 2015 ఆగస్టు నుంచి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దత్తత ప్రక్రియ చేపడుతున్నారు. దీని కోసం కేంద్రప్రభుత్వం (కారా) వెబ్సైట్ (సెంట్రల్ అడష్షన్ రిసోర్స్ అథారిటీ) రూపొందించింది. దంపతులు ముందుగా కింది పత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.