ఎదులాపురం : భార్య , అత్తింటివారి వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. ఆదిలాబాద్ వన్టౌన్ సీఐ ఎస్. రామకృష్ణ కథనం ప్రకారం ఆదిలాబాద్ శాంతినగర్కు చెందిన బండరివార్ రాహుల్ గౌడ్ ( 27) రిమ్స్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఇదే రిమ్స్లో పట్టణంలోని సుందరయ్యనగర్కు చెందిన మౌనిక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నది. ఈ క్రమంలో వీరిద్దరు రెండేళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఏడాది తరువాత వీరిద్దరూ వేరు కాపురం పెట్టారు. ఆరునెలల నుంచి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గతనెలలో మహిళా పోలీసు స్టేషన్లో వీరిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇకపై ఇద్దరం కలిసి ఉంటామని పోలీసుల ముందు ఒప్పుకున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కూడా భార్యాభర్తలు గొడవపడ్డారు. మౌనిక శనివారం మహిళా పోలీసు స్టేషన్కు మళ్లీ ఫిర్యాదు చేయగా రాహుల్ను కౌన్సెలింగ్కు పిలిచారు. దీనిని అవమానంగా భావించిన రాహుల్ శనివారం పురుగుల మందు తాగి ఖాళీ డబ్బాను పోలీసుస్టేషన్ దగ్గర పడవేసి స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మల్లేశ్ వెంటనే అతడిని రిమ్స్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య, అత్తింటివారి వేధింపులతోనే తన కుమారుడు రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి నందాబాయి వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.