ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరా న్నంటాయి. సోమవారం వేకువజాము నుంచే చిన్నారులు, యువతీ యువకులు, మహిళలు, పెద్దలు, వృద్ధులు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. యువకుల కేరింతలు, చిన్నారుల అల్లరి చేష్టలు, పెద్ద లు ఒకరికొకరు రంగులు పూసుకునే చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గనులపై డోలు వాయిస్తూ నృత్యాలు చేశారు. గిరిజన గూడేలు, తండాల్లో మహిళలు సంప్రదాయ థీంసా దరువుకు చిందులేశారు.
పర్యావరణం కలుషితం కాకుండా చిన్నారులు సహజ సిద్ధమైన గోగుపూలతో రంగులు తయారు చేసుకుని చల్లుకున్నారు. అనంతరం సమీప చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల్లోకి వెళ్లి స్నానం చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్ వేణు, రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు పాల్గొన్నారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుకు స్థానికులు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
– నమస్తే నెట్వర్క్