నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్(Narnoor ), గాదిగూడ (Gadiguda) ఉమ్మడి మండలంలో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం ( Heavy rains ) కురిసింది. దీంతో వాగులు, వంకలు లోతట్ట ప్రాంతాలు జలమయమయ్యాయి.నార్నూరు మండలంలోని బారిక్ రావు గూడ, ధన్ను గూడ, గాదిగూడ మండలంలోని మారుతి గూడ , కూనికాసా గ్రామాల సమీపంలోని వాగులు వరద నీటితో ఉప్పొంగాయి.
దీంతో గ్రామ గిరిజనుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు తగ్గేవరకు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.బారికరావు గూడలో గిరిజనులు సాహాసంతో వాగు దాటే ప్రయత్నాలు చేశారు. గాదిగూడ మండలంలోని ఖడ్కి, లోకారి, దాబా, అర్జుని ప్రధాన రహదారిపై లో లెవెల్ కల్వర్టులపై వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
కుప్పకూలిన ఇళ్లు..
గాదిగూడ మండల కేంద్రానికి చెందిన భీంరావ్ ఇల్లు ఒక్కసారిగా కుప్ప కూలింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడడంతో ఒక్కసారిగా ఇల్లు కుప్పకూలిందని తెలిపారు. వర్షపు నీరుతో తినుబండరాలు, నిత్యవసర సరుకులు తడిచిపోయాయన్నారు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు బయటికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు స్పందించి విచారణ చేపట్టి ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితుడు కోరారు.