మాతా, శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందు కెళ్తోంది. ఇందుకోసం యేటా పోషణ్ అభియాన్ పేరిట మాసోత్స వాలను నిర్వహిస్తున్నది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ మొదటి వారం నుంచి చివరి వారం వరకు కార్యక్రమం కొనసాగిస్తోంది. గర్భి ణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, చిన్నారుల ఆరోగ్య పరిస్థి తులపై అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది ప్రచారం నిర్వహిస్తారు. వివిధ శాఖల సమన్వయంతో పోషకాహారంపై అవగాహన, చిన్నారులకు అన్నప్రాసన, సీమంతాలు, అక్షరాభ్యాసం, గర్భిణుల నమోదుతోపాటు పరీక్షలు, వైద్య శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు.
నిర్మల్ చైన్గేట్, ఆగస్టు 31 : మాతా, శిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందుకు అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నది. ప్రభుత్వం యేటా సెప్టెంబర్ మాసంలో పోషణ్ అభియాన్ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, ఆరోగ్య సంరక్షణపై ప్రచారం నిర్వహిస్తారు. చిన్నారుల ఎదుగుదల, మాతా శిశు సంరక్షణతోపాటు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఈనెలాఖరు వరకు పోషణ మాసోత్సవాలు నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఈ కార్యక్రమంలో పాల్గొనేలా అధికారులు ప్రణాళికలు రూపకల్పన చేశారు. ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యవంతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. పోషణ మాసోత్సవాలు విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
మొదటి వారం : ప్రత్యేక పెరుగుదల పర్యవేక్షణ డ్రైవ్ నిర్వహిస్తారు. చిన్నారుల బరువు, జబ్బ చుట్టూ కొలత తీసుకోవడం, కొలతల వివరాలు రిజిస్టర్లో నమోదు చేయడం, పిల్లల పెరుగుదల పర్యవేక్షణ చేయడం, ఎన్హెచ్టీఎస్లో నమోదు చేయడం, పోషణ ట్రాకర్లో నమోదు చేయడం చేస్తారు. చిన్నారులకు టీకాలు, గర్భిణులకు ఆసుపత్రిలో చెకప్ చేయడం, పోషకాహారం పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. అనుబంధ పోషకాహార కార్యక్రమం, టేక్ హోం, రేషన్(టీహెచ్ఆర్), ఐరన్ మాత్రలు, కాల్షియం మాత్రలు సరఫరా చేస్తారు. సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
రెండోవారం : చిన్నారుల బరువులు చూడడం, పోషకాహారానికి పెరటి తోటల పెంపకం ప్రారంభం, విటమిన్-సి అధికంగా ఉండే పండ్ల మొక్కల పెంపకం వంటివి చేయాలి. అంగన్వాడీ పరిధిలో ఐదేళ్లలోపు పిల్లలందరి పెరుగుదల పర్యవేక్షణ చేయాలి. గర్భిణులను నమోదు చేయడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కిశోర బాలికలకు రక్త పరీక్షలు చేయించడం, ఆరోగ్య, పోషకాహార ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మూడోవారం : చిన్నారులకు టీకాలు, గర్భిణుల బరువు చూడడం, పరీక్షలు చేయించడం, పోషకాహారం, తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించడం, గర్భిణుల నమోదు వంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ర్యాలీలు, అవగాహన సమావేశా లు ఏర్పాటు చేయడం, ప్రజాప్రతినిధు లు, అధికారులు కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడడం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహించడం చేస్తారు.
నాలుగోవారం : పోషకాహారం తీసుకునేందుకు శుభ్రత పాటించడం, ఇతర విద్యార్థులను ప్రోత్సహించడం వంటివి చేయాలి. ఉదయం ప్రార్థనలో పోషకాహారంపై రోజువారి సందేశాలు ఇవ్వడం, వ్యాసరచన పోటీలు, చేతుల శుభ్రతపై ప్రదర్శనలు చేయించాలి.
పోషకాహారం లోపం ఉన్న చిన్నారులను గుర్తించాలి..
గృహ సందర్శన కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోషకాహారం లోపం ఉన్న చిన్నారులను గుర్తించాలి. చిన్నారుల తల్లిదండ్రులను, సంరక్షకులను కేంద్రాలకు ఆహ్వానించాలి. వారితో పోషకాహారం లోపంపై వారికి వివరించాలి. ఇంట్లోనే పోషణ స్థాయి మెరుగు పర్చేందుకు కౌన్సెలింగ్ చేయాలి. ఏఎన్ఎంల సలహా మేరకు దవాఖానలో చేర్పించాలి.
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం..
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. షెడ్యూల్ ప్రకారం అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమాల నిర్వహణ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించాం. అన్ని శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పోషకాహార విలువలపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాం. అంగన్వాడీ అధికారులు, సిబ్బందికి పోషణ మాసోత్సవాలు నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చాం. పోషకాహారంపై అవగాహన, చిన్నారులకు అన్నప్రాసన, సీమంతాలు, అక్షరాభ్యాసం, గర్భిణుల నమోదు చేయడంతోపాటు పరీక్షలు, వైద్య శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టడం జరుగుతుంది. – ఎర్రపత్తి రమేశ్, జిల్లా సంక్షేమ అధికారి, నిర్మల్.