ఎదులాపురం, నవంబర్ 23 : దివ్యాంగుల క్రీడా పోటీల్లో పాల్గొనాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడలను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని దివ్యాంగులకు నిర్వహిస్తున్న క్రీడల్లో ఉత్సాహంగా పొల్గొనాలని కోరారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
10 నుంచి 54 ఏండ్ల దివ్యాంగులు పొల్గొనవచ్చని తెలిపారు. కరోనా కారణంగా రెండేండ్లు పోటీలు నిర్వహించుకోలేకపోయామన్నారు. పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొని, క్రీడలను విజయవంతం చేయాలని కోరారు. వైద్యశాఖ ద్వారా మెడికల్ సహకారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, జిల్లా యంత్రాంగం సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా నిర్వహించే క్రీడల్లో ప్రతి ఒక్క దివ్యాంగుడూ పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, ఒలింపిక్ జిల్లా అధ్యక్షుడు బీ గోవర్థన్ రెడ్డి, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, కోచ్లు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.
ముక్రా(కె)లో పర్యటన..
ఇచ్చోడ, నవంబర్ 23 : ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే)లో సోలార్ గ్రిడ్, డిజిటల్ లైబ్రరీ, బృహస్పతి పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాన్ని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్తో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. కాసేపు క్రికెట్ ఆడారు. సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్ను సన్మానించారు. జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశానికే ఆదర్శ గ్రామంగా ముక్రా(కె) నిలుస్తుందన్నారు. అన్ని గ్రామపంచాయతీలు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొత్త ఆలోచనలతో అభివృద్ధి వైపువెళ్తున్న ముక్రా(కె) దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ రవీందర్ రాథోడ్, డీపీవో శ్రీనివాస్, ఆర్డీవో కిషన్, ఎంపీడీవో రాం ప్రసాద్, ఎంపీపీ ప్రీతం రెడ్డి, ఎంపీడీవో రమేశ్, ఏపీవో నరేందర్ పాల్గొన్నారు.