జన్నారం, మార్చి 20: మండలంలోని తిమ్మాపూర్లో బుధవారం మధ్యాహ్నం కురిసిన వడగండ్ల వానకు రైతులు వేసుకున్న మక్క పంట నేలపాలైంది. రైతులు జే మల్లేశ్ 2 ఎకరాలు, కే శంకర్కు చెందిన 4 ఎకరాల మక్క పంటకు నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.
కౌటాల, మార్చి 20: మండలంలో మంగళవారం రాత్రి కురిసిన గాలి వర్షానికి మిరప, మామిడికి నష్టం వాటిల్లింది. ముత్తంపేట గ్రామంలో రైతులు మిరప పంటను ఎండబెట్టగా, వర్షపు నీటిలో తడిశాయి. ఈదురు గాలులకు మామిడి కాయలు నేల రాలాయి. చేతికొస్తున్న పంట అకాల వర్షానికి నష్టపోతుండడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
దండేపల్లి, మార్చి 20: మండలంలోని తాళ్లపేట, నాగసముద్రం గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. మ్యాదరిపేట, చింతపల్లి, తాళ్ల పేట గ్రామాల్లో కొంత మంది రైతుల మక్క పంట నేలకొరిగింది. నర్సాపూర్లో శ్రీనివాస్కు చెందిన నాలుగు మేకలు, సత్తయ్యకు చెందిన మూడు మేకలపై పిడుగు పడడంతో అక్కడికక్కడే
చనిపోయాయి. సుమారు రూ. 80 వేల నష్టం వాటిల్లిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. నెల్కి వెంకటాపూర్ జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి చెట్లను తొలగించారు.