రేపు గురుకుల ఐదో తరగతి పరీక్ష
హాజరుకానున్న 5,968 మంది విద్యార్థులు
నిర్మల్ జిల్లాలో 16 పరీక్షా కేంద్రాలు
నిర్మల్ అర్బన్, మే 6 : గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో విద్యార్థులు చేరేందుకు నిర్వహించే పరీక్షకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 13 గురుకులాలున్నాయి. ఇందులో ఐదు సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ఒక ట్రైబల్ వెల్ఫేర్, ఆరు బీసీ వెల్ఫేర్, ఒక సాధారణ గురుకులాలున్నాయి. వీటిలో ఐదో తరగతిలో చేరేందుకు ఈ నెల 8న ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకోసం 5,968 మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తం 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు పూర్తి..
ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కోఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికే పూర్తి చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాలల్లో తాగు నీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయించారు. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి, శానిటైజర్, వాటర్ బాటిల్తో పరీక్షా కేంద్రాలకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్ అధికారులను కేటాయించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ను అమలు చేయనున్నారు. పరీక్షా కేంద్రానికి ఉదయం 10 గంటల్లోపే చేరుకోవాలని, 11 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఓఎంఆర్ షీట్పై జవాబులను రాయాల్సి ఉండంతో ఇన్విజిలేటర్ల ద్వారా అవగాహన కల్పించడానికి విద్యార్థులను అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
పరీక్షా కేంద్రాలివే..
గురుకుల ప్రవేశ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 5,968 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో వీరికి జిల్లాలో మొత్తం 16 పరీఞా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్, భైంసా, ముథోల్లో కేంద్రాలున్నాయి. టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జేసీ కడెం, మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర, బాలికల పాఠశాల ఖానాపూర్, సోఫీనగర్ గురుకుల పాఠశాల, మహాత్మా జ్యోతిబాఫూలే నిర్మల్, రాచాపూర్, టీఎస్డబ్ల్యూ ఆర్ఎస్ లెఫ్ట్ట్ పోచంపాడ్, పాక్పట్ల, కుంటాల మోడల్ స్కూల్, టీఎస్డబ్ల్యూ ఆర్ఎస్ బాలుర జూనియర్ కళాశాల ముథోల్, టీటీడబ్ల్యూఆర్జేసీ ముథోల్, మహాత్మా జ్యోతిబాఫూలే ముథోల్, టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాల జాం, టీఎస్డబ్ల్యూఆర్ఎస్ భైంసా, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ముథోల్, టీఎస్డబ్ల్యూ ఆర్ఎస్ జేసీ పోచంపాడ్, టీఎస్ఆర్ఎస్ పోచంపాడ్ (బాలికల)లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
960 సీట్లకు.. 5,968 మంది పోటీ..
జిల్లాలోని 13 ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కోసం బాలబాలికల 960 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం 5,968 మంది విద్యార్థులు పోటీపడుతున్నారు. ప్రతి పాఠశాలకు 80 సీట్లను అధికారులు కేటాయించారు. ఒక్కో సీటుకు సగటున ఆరుగురు పోటీపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, సన్నబియ్యంతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందిస్తుండడంతో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది.
పకడ్బందీగా నిర్వహిస్తాం..
జిల్లాలోని 13 ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చాం. విద్యార్థులకు హాల్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాం. కొవిడ్ నిబంధనలు పాటించి విద్యార్థులు పరీక్షకు హాజరుకావాలి. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
– రాజేంద్ర ప్రసాద్, జిల్లా కో ఆర్డినేటర్, నిర్మల్