కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/పెంచికల్పేట్, మే 24 : పెంచికల్పేట్ మండలం ఎల్లూరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐదు రోజులుగా కొనుగోళ్లకు బ్రేక్ పడింది. రైతులు సుమారు ఎనిమిది లోడ్ (4800 బస్తాలు-1290 క్వింటాళ్లు)ల బస్తాల ధాన్యాన్ని విక్రయానికి ఇక్కడికి తీసుకురాగా, మిల్లర్లు వద్దన్నరన్న సాకుతో నిర్వాహకులు సేకరణ నిలిపివేయడం గందరగోళానికి దారి తీస్తున్నది. అన్నదాతలు వడ్లను ఆరబెట్టి తేమ శాతం తగ్గించి బ్యాగుల్లో నింపి మరీ పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
మిల్లర్లు, నిర్వాహకులు మిలాఖత్ అయి తమ స్వలాభం కోసం ఏదో ఒక సాకు చెప్పి కొనుగోళ్లు నిలిపివేశారు. ఇక ఆకాశంలో మబ్బులు పడుతుండగా, రైతులు కంగారు పడి నష్టానికి అమ్ముకునే పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఓ రైతు వద్ద క్వింటాలుకు 8 నుంచి 10 కిలోల చొప్పున కోత విధించి కొనుగోలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.. ప్రతి గింజనూ కొనాలి.. అని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశిస్తున్నా రైస్ మిల్లర్లు, దళారులు బేఖాతర్ చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్కు రూ. 2300 చొప్పున కొనాలి. కానీ.. ఏదో ఒక సాకు చెబుతూ సేకరణ చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. లారీలు పంపించకపోవడం..
తప్పతాలు పేరిట ఇబ్బందులు పెట్టడం.. క్వింటాలుకు 8 నుంచి 10 కిలోల చొప్పున కోత విధించే దుస్థితి తీసుకురావడం.. బయట దళారులకు విక్రయించేలా పరిస్థితి తీసుకురావడంవంటివి చేపడుతున్నారు. ఎల్లూరులోనేగాక కొండపల్లి, గొండ్లపేట్లో సెంటర్లలోనూ ఇదే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షాలు పడే అవకాశమున్నందున ఏం చేయాలో తోచక అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు.
సుమారు 40 క్వింటాళ్ల ధాన్యం అమ్మేందుకు ఎల్లూరుకు తీసుకొచ్చిన. ఇప్పటికి ఐదు రోజులైతంది. కాంటా పెట్టలేదు. ఎందుకని అడిగితే లారీలు వస్తలేవంటున్నరు. మిల్లర్లు వడ్లు కొనద్దని చెప్పిన్రంటున్నరు. ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి తేమలేకుండా చేసిన. రాత్రీ..పగలు ఇక్కడే కావలి కాస్తున్న. ఇంకెన్ని రోజులైతదో మరి.
– దుర్గం దేవాజీ, రైతు
నాలుగు రోజుల కింద సుమారు 30 క్వింటాళ్ల వడ్లు ఎల్లూరు కొనుగోలు కేంద్రానికి తెచ్చిన. నాతోపాటు మస్తు మంది రైతులు ఇక్కడే పడిగాపులు కాస్తున్నరు. వడ్లు బస్తాల్లో నింపి ఉంచినం. ధాన్యం ఎందుకు కొంటలేరని అడిగితే మిల్లర్లు వద్దన్నరని చెబుతున్నరు. రైతులంతా దళారులకు వడ్లు అమ్ముకునేలా చూస్తున్నరు.
– గోలేటి శంకర్, రైతు
మిల్లర్లు ధాన్యం పంప వద్దని చెప్పా రు. అందుకే ధాన్యం కొను గోళ్లు నిలిపివే శాం. మిల్లుల్లో లారీలు ఖాళీచే యడం లేదు. లారీలు వస్తేనే కద ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసేది. లారీల కొరత చూపించి మిల్లర్లు ధాన్యం ట్రాన్స్పోర్టు సమస్యలు సృస్టిస్తున్నారు. ఇక్కడ దాదా పు 8 లోడ్ల ధాన్యం ఉంది. వాటిని కొను గోలు చేయాల్సి ఉంది.
– వెంకటేశ్వర్ గౌడ్, ఎల్లూరు కేంద్రం నిర్వాహకుడు