చెన్నూర్, నవంబర్ 9: చెన్నూర్ ప్రాంత ప్రజల చిరకాల కల నెరవేరబోతున్నది. చెన్నూర్లో బస్ డిపో కావాలని ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. విప్ బాల్క సుమన్ చొరవతో ప్రభుత్వం చెన్నూర్కు బస్డిపో మంజూరు చేసింది. దీంతో డిపో ఏర్పాటుకు పట్టణ సమీపంలో నాలుగెకరాల స్థలం కేటాయింపుతో పాటుగా రూ. 4కోట్లు మంజూరు చేసింది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ జులై 30న బస్ డిపో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇక నాటి నుంచి డిపో నిర్మాణ పనులు శర వేగంగా సాగుతున్నాయి. ప్రహారీ, గ్యారేజ్, కార్యాలయం కోసం భవనాలు, వాషింగ్ ప్లాట్ ఫాం, ఆయిల్ స్టోర్ రూం, సెక్యూరిటీ రూం, మరుగు దొడ్లు లాంటి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి కాగానే బస్ డిపోను ప్రారంభించనున్నారు.
బస్డిపో ఏర్పాటుతో చెన్నూర్ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగనుంది. చెన్నూర్ నుంచి కోటపల్లి, వేమనపల్లి మండలాల్లోని గ్రామాలకు నిత్యం బ స్సులు నడువనున్నాయి. అంతేకాకుండా చెన్నూర్ మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు జాతీయ రహదారి నిర్మా ణం కావడంతో అక్కడి ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. చెన్నూర్ నుంచి హైదరాబాద్, ఆదిలాబ్, కరీంనగర్, గోదావరిఖని, నిజామాబాద్, వరంగల్, భూపాలపల్లి, కాళేశ్వరం లాంటి ప్రాంతాలకు కూడా రాకపోకలు పెరుగనున్నాయి. చెన్నూర్ పట్టణం వ్యాణిజ్యపరంగా అభివృద్ధి చెందనుంది.
ప్రస్తుతం చెన్నూర్ పట్టణంతో పాటు కోటపల్లి, వేమనపల్లి మండలాల గ్రామాలకు, కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి, మహరాష్ట్రంలోని సిరోంచకు మంచిర్యాలలోని బస్డిపో ద్వారా బస్సులను నడుపుతున్నారు. దీంతో బస్సులు సరైన సమయానికి రాక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం 50కి పైగా బస్సులు నడుస్తుంటాయి. అంతేకాకుండా ఉదయం మంచిర్యాల డిపో నుంచి బస్సులు చెన్నూర్కు బయలుదేరి, తిరిగి చెన్నూర్ నుంచి మంచిర్యాలకు సాయంత్రం డిపోకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికులు లేక ఖాళీగానే తిరగాల్సి వస్తుండడంతో ఆర్టీసీకి కొంత మేర నష్టం వస్తున్నది. ఇక్కడ బస్ డిపో ఏర్పాటైతే ప్రజలకు రవాణ సౌకర్యం కలగడమే కాకుండా, ఆర్టీసీకి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డిపో పనులు శరవేగంగా సాగుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.