ఇంద్రవెల్లి : గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను ( Medical services ) మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ( Collector Rajarshi Shah ) స్పష్టం చేశారు.
శనివారం ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ తండా గ్రామంలో టీబీ రహిత గిరిజన ( TB-free tribal area ) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమగ్ర ఆరోగ్య పరీక్షా శిబిరాన్ని , శిబిర ప్రచార వాహనాలను ప్రారంభించారు. అనంతరం రోగులకు నిక్షయ్ మిత్ర కిట్లను పంపిణీ చేయడంతో పాటు, మెడికల్ ఆఫీసర్ సరస్వతిని అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ‘ టీబీ ముక్త భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా పిరమల్ ఫౌండేషన్ సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ మండలాల్లోని మూడు బ్లాకుల్లో ఈ కార్యక్రమం ప్రారంభించబడుతున్నట్లు తెలిపారు.
ఈ ప్రత్యేక శిబిరంలో అన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించబడుతు న్నాయని, ప్రజలు ఎవరూ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ గ్రామాల్లోనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీ పూర్తిగా నయమవుతుందని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావద్దని భరోసా కల్పించారు. అనంతరం గ్రామంలో ఘనంగా నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో కలెక్టర్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆయన సంప్రదాయ నృత్యం చేస్తూ స్థానికులను ఉత్సాహపరిచారు.