సోన్, ఫిబ్రవరి 1 : ‘మన ఊరు-మన బడి’ విద్యారంగంలో విప్లవాత్మక మార్పు అని, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మండలం ఎల్లపెల్లి గ్రామంలోని ‘మన ఊరు-మన బడి’ కింద పనులు పూర్తిచేసుకున్న పాఠశాలను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉన్నదన్నారు. విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ సర్కారు సూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు. ‘మన ఊరు-మన బడి’ కింద అన్ని ప్రభుత్వ పాఠశాల్లో సకల వసతులు కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యలో విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. అన్ని సౌకర్యాలు కల్పించడంతో ఉపాధ్యాయులు కూడా ప్రశాంత వాతావరణంలో పాఠాలు బోధించే అవకాశం కలిగిందన్నారు. నిర్మల్ జిల్లాలో మొదటి విడుతలో రూ.82 కోట్లతో 260 పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని, మూడు దశల్లో అన్ని పాఠశాలల పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు.
కలెక్టర్ పాలన మరువలేరు..
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పాలనను జిల్లా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని మంత్రి అల్లోల స్పష్టం చేశారు. కలెక్టర్గా మూడేళ్ల పాటు పనిచేసి బదిలీపై వెళ్తున్న ఆయనను ఎల్లపెల్లిలో శాలువాతో సత్కరించి, పూలమొక్క అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా కలెక్టర్ కృషి చేశారన్నారు. జిల్లా అధికారుల సమన్వయంతో ధైర్యంగా కరోనా వైరస్ను ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అల్లోల రవీందర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, వైస్ చైర్మన్ శ్రీకాంత్యాదవ్, డీఈవో రవీందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో సాయిరాం, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 1 : నిర్మల్ పట్టణంలో ఫుట్పాత అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.2 కోట్లతో ట్యాంక్బండ్ నుంచి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వరకు చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. పట్టణాన్ని మహా నగరాలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే సుందరీకరణ పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు.
షాదీఖాన పనులకు..
జిల్లా కేంద్రంలోని గాజుల్పేట్ కాలనీలో రూ.2 కోట్లతో షాదీఖానా నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముస్లింలు రంజాన్, బక్రీద్ సమయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు 10 ఎకరాల్లో ఈద్గా నిర్మిస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల శ్రేయస్సే బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు రాంకిషన్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, కౌన్సిలర్లు తౌహీద్ ఉద్దీన్, సలీం, మతీన్, పూదరి రాజేశ్వర్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు నజీర్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, డీఈ నాగేశ్వర్, నాయకులు జాకీర్, రిజ్వాన్ తదితరులున్నారు.
ఆలయం ప్రారంభం..
నిర్మల్ పట్టణంలోని గాంధీచౌక్ కాలనీలో పునర్నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతితో కలిసి మంత్రి ప్రారంభించారు. ముందుగా వారికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు న్విహించారు.
సహకార సంఘ భవనం, ఎరువుల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన..
సారంగాపూర్, ఫిబ్రవరి 1 : సారంగాపూర్ మండలంలోని ఆలూర్ గ్రామంలో రూ.45లక్షల అంచనా వ్యయంతో మంజూరైన సహకార సంఘ భవనం, ఎరువుల గోదాము నిర్మాణ పనులకు మంత్రి అల్లోల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నట్లు చెప్పారు. అడెల్లి పోచమ్మ పునర్నిర్మాణ పనులకు మొదటి విడుతగా రూ.6 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
త్వరలో కృష్ణ శిలలతో గుడిని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, వైస్ ఎంపీపీ పతాని రాధ, ఆలూర్ సొసైటీ చైర్మన్ ఎలిపెద్ది మాణిక్రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, సర్పంచ్ దండు రాధ, సొసైటీ కో-ఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్, నాయకులు రాజ్మహ్మద్, శ్రీనివాస్రెడ్డి, దండుసాయి కృష్ణ, జీవన్రావు, గడ్డం ముత్తన్న, రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.