నిర్మల్ అర్బన్/ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 22 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు క్రీడలను ప్రోత్సహిస్తున్నది. క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూనే, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే వారికి నగదు ప్రోత్సాహాకాలు అందిస్తున్నది. వారిలో మరింత ఉత్సాహం నింపుతున్నది. గ్రామాల్లో ప్రత్యేక క్రీడా ప్రాంగణాలు, పట్టణాల్లో పట్టణ క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడాకారులకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో మైదానాలను అందుబాటులోకి తెచ్చింది. అలాగే స్టేడియాలకు భారీగా నిధులు వెచ్చిస్తూ క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నది. ప్రత్యేకంగా వేసవి శిబిరాలను నిర్వహిస్తూ వివిధ క్రీడల్లో శిక్షణనిప్పిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, నిర్మల్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియం క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేందుకు వీలుగా అనేక సౌకర్యాలను కల్పించింది. నిర్మల్ జిల్లాలో 396 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే 554 క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి నిత్యం క్రీడాకారులు ఆటలాడుకునేలా తీర్చిదిద్దారు.
ఊరుకో క్రీడా ప్రాంగణం భేష్..
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 22: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఊరుకో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయిస్తున్నది. క్రీడాకారుల్లో నైపుణ్యం పెరిగేందుకు ఈ ప్రాంగణాలు ఎంతో ఉపయోగపడుతయ్. పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన స్టేడియాలను గ్రామీణ ప్రాంతం ప్రజల ముంగిట ఉంచడం చాలా సంతోషకరం. తోటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని అనేక మంది క్రీడాకారులు తయారవుతున్నారు. అంతర్జాతీయ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారయ్యాం. చదువుతో పాటు పాఠశాలల్లో క్రీడలను నేర్చించడం, విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడలపై మక్కువ పెంచుకునేలా చర్యలు తీసుకోవడంలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టింది. వేసవి సెలవుల్లో క్రీడాకారులు ఎంచుకున్న క్రీడల్లో రాటుతేలేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఉచితంగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేసింది. క్రీడలు, క్రీడాకారులపై గతంలో ఏ ప్రభుత్వాలు ఇంత శ్రద్ధ తీసుకోలేదు.
– డీ మౌనిక, జాతీయ స్థాయి బేస్బాల్ క్రీడాకారిణి, మామడ
పాఠశాలల్లో క్రీడాపోటీల నిర్వహణ..
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 22 : రాష్ట్ర ప్రభుత్వం చదువుతోపాటు విద్యార్థులకు క్రీడలు అవసరమని భావించింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నది. వీరికి ప్రతిరోజూ వ్యాయామం కోసం ట్రాక్ షూట్లు, క్రీడాసామగ్రిని అందుబాటులో పెట్టింది. గతంలో కాగితాలకే పరిమితమైన క్రీడాకారుల రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చి ఉద్యోగ, ఉన్నత విద్యలో రెండు శాతం కోటాను అమలు చేస్తూ క్రీడాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నది. ఉద్యోగాల్లో క్రీడా కోటా అమలుతో అనేక మంది విద్యార్థులు క్రీడలపై మక్కువ పెంచుకుంటున్నారు. క్రీడాప్రాంగణాలు అందుబాటులోకి రావడంతో భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించే అవకాశం ఉంది. – ఎస్.దత్తు, సౌత్జోన్ లాంగ్జంప్ మెడలిస్ట్
క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం..
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 22 : రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నది. విద్యారంగ అభివృద్ధితో పాటు క్రీడలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడల ప్రాధాన్యతను ప్రభుత్వాలు గుర్తించక పోవడంతో క్రీడలకు సరైన గుర్తింపు లేకుండా పోయింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరాదరణకు గురైన క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. క్రీడల్లో రాణిస్తే సరైన గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వడంతో పాటు నగదు పురస్కారాలు, సన్మానాలు చేపట్టడంతో క్రీడాకారుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. మరికొందరు క్రీడలపై మక్కువను పెంచుకొని క్రీడల వైపు దృష్టి సారిస్తున్నారు.
– ఎస్ అక్షిత, సాఫ్ట్బాల్ జాతీయ స్థాయి క్రీడాకారిణి, నిర్మల్
నగదు బహుమతులు అందించి ప్రోత్సాహం..
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 22 : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నగదు బహుమతులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. మరికొంత మంది క్రీడాకారులు తయార య్యే అవకాశం ఉంది. అలాగే అంతర్జాతీయ సా ్థయిలో పతకాలు సాధిస్తున్న క్రీడాకారులకు ఉద్యోగాలు కల్పించి ప్రోత్సహిస్తున్నది. గ్రామీణ క్రీడాకారులకు పల్లె క్రీడాప్రాంగణాల అందుబాటులోకి రావడంతో యువత సాధన చేయడానికి అవకాశం ఏర్పడింది.
– సాయిని రవికుమార్, సీనియర్ కబడ్డీ ఫ్లేయర్
క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయడం అభినందనీయం..
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 22 : ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టడం అభినందనీయం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు లేక యువత క్రీడలకు దూరమయ్యేవారు. దీనిని దృష్టిలో పెట్టుకొని క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించారు. అనేక పరికరాలను అందుబాటులో పెట్టారు. దీంతో యువత క్రీడలపై ఆసక్తి చూపుతున్నా రు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. అనేక పతకాలు సాధిస్తున్నారు. ఇదీ మంచి పరిణామం. – ఎం.ఆదిత్య, నేషనల్ సిల్వర్ మెడలిస్ట్