నార్నూర్, మార్చి 20 : చిన్నారులే జాతి సంపద.. రేపటి పౌరులు ఆరోగ్యంగా ఉండడం ప్రధానం. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తున్న నార్నూర్, గాదిగూడ మండలాల్లో పోషణ లోపంతో సతమవుతున్న చిన్నారులు ఎంతో మంది ఉన్నారు. సమస్య నుంచి బయటపడేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం పంపిణీ చేయిస్తోంది. మరోవైపు ఇక్కడికి రాని వారికి ఉపయోగపడేలా ప్రభుత్వం పోషణ సంబురాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 3 వ తేదీ వరకు పక్షోత్సవాల పేరిట ఆయా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నార్నూర్ మండలంలో 154 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 343 మంది ఆరు నెలలలోపు చిన్నారులు, మూడేళ్లలోపు 2192 మంది, ఆరు ఏళ్లలోపు 2850 మంది, 391 మంది గర్భిణులు 388 మంది బాలింతలు ఉన్నారు.
అందరి భాగస్వామ్యంతో..
స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ ఆరోగ్య సమాజానికి చైతన్యం తీసుకొచ్చేందుకు 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఇందులో భాగంగా పోషక లోపంతో తలెత్తే పలు అంశాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
అవగాహన ఇలా…
చిన్నారులు ఎదగాలంటే విటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉన్న పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. పాలు, నూనె ఇంకా అయోడిన్ ఉప్పు నాలుగు నెలల్లో మొదలు పెట్టి. ఆరో నెల వచ్చే వరకు రోజూ ఒక ఎరుపు రంగు ఐఎస్ఏ మాత్ర వేసుకోవాలి. వైద్యులు సూచించిన కాల్షియం మాత్రలు వేసుకోవాలి. స్వచ్ఛమైన నీటిని తాగాలి. గర్భిణులు ప్రసవానికి ముందు కనీసం నాలుగు సార్లు ఏఎస్సీ పరీక్షలు చేయించుకోవాలి, బిడ్డకు ఆరు నెలలు వయస్సు వచ్చే వరకు తల్లిపాలు పట్టించాలి. ఆ తర్వాత అదనపు ఆహారం ఇవ్వాలి. ఐదేళ్ల వరకు అన్ని టీకాలు క్రమం తప్పకుండా వేయించాలి.
సత్ఫలితాల సాధనకు..
తమ బిడ్డలకు పాలు కూడా పట్టే సమయం కూడా తల్లులకు ఉండడం లేదు. డబ్బాపాలు పట్టడం ద్వారా పిల్లల్లో ఎదుగుదల లోపిస్తోంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ అంశంపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టులో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే వారోత్సవాలతోనే సరిపెట్టకుండా తల్లిపాల ప్రాధాన్యంపై నిరంతరం అవగాహన కల్పిస్తేనే సత్పలితాలు ఉండే అవకాశం ఉంటుంది.
చిరుధాన్యాల ప్రయోజనాలపై ప్రచారం
చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తాయో తెలియనిది కాదు. వీటిని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రయోజనాలు, వినియోగంపై చైతన్యం తీసుకు వచ్చేలా ఈ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ సారి పోషణ్ పక్షోత్సవాల్లో సదరు అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు. మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు నార్నూర్, గాదిగూడ మండలాల వ్యాప్తంగా పోషణ పక్షోత్సవాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తాం. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగంగా మండల వ్యాప్తంగా పోషణ్ అభియాన్లో భాగంగా నిర్వహిస్తున్న 15 రోజుల కార్యక్రమాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటాం. వయసుకు తగ్గట్టుగా బరువులేని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూస్తున్నాం. చిరుధాన్యాల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తాం.
-శారద, ఐసీడీఎస్ సీడీపీవో, ఉమ్మడి మండలం