కడెం, ఫిబ్రవరి 14 : నిర్మల్ జిల్లా కడెం మండలకేంద్రంలో 2011లో ప్రారంభమైన పాలశీతలీకరణ కేంద్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నది. 3 వేల లీటర్ల సా మర్థ్యం కలిగిన ఈ పాల కేంద్రం తొలుత 200 లీటర్లతో ప్రారంభమై, ప్రస్తుతం 2 వేల లీటర్లను సేకరిస్తున్నది. కడెం, ఖానాపూర్, జన్నారం, ఉట్నూర్ మండలాల రైతులకు ఉపాధి వనరుగా మారింది. ఉమ్మడి జిల్లాలో కడెంతో పాటు నిర్మల్, భైంసా, లక్షెట్టిపేట, ఆదిలాబాద్, చె న్నూర్ ప్రాంతాల్లో పాలశీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
విజయ డెయిరీ పేరిట రైతులకు పలు రాయితీలను అందిస్తూ, వెన్నశాతం ద్వారా ధరలను మరింత పెంచి అం డగా నిలుస్తున్నది. కడెం, ఖానాపూర్, జన్నారం, ఉట్నూర్ మండలాల్లో 26 కేంద్రాలు ఏర్పాటు చేసి 35 గ్రామాల్లో 850 మంది రైతుల వద్ద పాలను సేకరిస్తున్నారు. 3 వాహనాల ద్వారా నిత్యం ఉదయం, సాయంత్రం గ్రామాల్లోకి వెళ్లి పాలను తీసుకుంటున్నారు. వెన్నశాతం ద్వారా గ్రామా ల్లో రైతుల నుంచి పాలను సేకరించి కడెం విజయ డెయిరీ కేంద్రానికి తీసుకొస్తారు. ఇక్కడికి తీసుకొచ్చిన పాలను భద్రపరిచి వాటిని ఇక్కడి అవసరాల మేరకు విక్రయించి మిగిలిన పాలను యూనిట్ కార్యాలయాలకు తరలిస్తారు.
వెన్నశాతం ద్వారా రైతులకు డబ్బులు..
గ్రామాల్లో రైతుల నుంచి సేకరించిన పాలకు వెన్నశాతం బట్టి రైతులకు నగదు చెల్లిస్తున్నారు. నెలలో 15 రోజులకోసారి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ఒక నెలలో రైతుల నుంచి సేకరించిన పాలకు 11లక్షల నుంచి 12 లక్షల వరకు డబ్బులు చెల్లిస్తున్నారు.
యూనిట్ కార్యాలయాలకు పాల సరఫరా..
మండలాల్లోని ఆయా గ్రామాల వారీగా సేకరించిన పాలను ఆదిలాబాద్, నిర్మల్, లక్షెట్టిపేట ప్యాకింగ్ కేంద్రాలకు నిత్యం తరలిస్తారు. యూనిట్ కార్యాలయాల నుంచి రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లి. హైదరాబాద్కు పంపిస్తారు. అక్కడ భద్రపరిచిన పాలను 26 రకాలుగా ఉపయోగిస్తారు. టీఎస్డీడీసీఎఫ్ ఆధ్వర్యంలో రైతులు అమ్మిన పాలకు వెన్నశాతంతో పాటు ప్రభుత్వం మరో రూ. 4 అదనంగా అందజేస్తున్నది
వ్యత్యాసానికి కారణాలు..
వెన్నశాతంలో మార్పులు వస్తున్నాయంటే తప్పనిసరిగా కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. పశువులలో రకాలు, జాతి బేధము, కాల ప్రభావం, ఈనిన తర్వాత రోజులు, ఈతల సంఖ్య, పాలు పితికే వేళల్లో మార్పులు, పశువుల ఆరోగ్య పరిస్థితి, తినే మేత, పాలు పితికే విధానం, పాలు పితికే చోటు మార్పు, తదితర విధానాల ద్వారా వెన్నశాతంలో మార్పులు గమనించవచ్చు
రైతు కుటుంబాలకు సర్కారు అండ..
పాడి రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. గడ్డి విత్తనాలను రాయితీగా అందించడంతో పాటు, వారి కుటుంబాల్లోని విద్యార్థులకు ప్రోత్సాహాకాలను అందజేస్తున్నది. గడ్డి విత్తనాలకు 50 శాతం రాయితీ, దాణా కోసం రూ. 1200 ధర కాగా, ఇందులో ప్రభుత్వం రైతుకు రూ. 835 చెల్లిస్తున్నది. రైతు కుటుంబంలోని పదో తరగతి విద్యార్థికి 9.8, 10 జీపీఏ సాధిస్తే వారికి ప్రోత్సాహకంగా రూ. 1000 అందజేస్తున్నారు. అలాగే ఎంసెట్ విద్యార్థి 10 వేల లోపు ర్యాంక్ సాధిస్తే వారికి రూ. 2 వేలు అందజేస్తున్నారు. అలాగే 6 నెలల కాలం పాటు రైతు విజయ డెయిరీకి పాలను నిత్యం విక్రయిస్తే వారి ఇంటికి పెళ్లి కానుకగా రూ. 5 వేలను అందజేస్తున్నారు. ఈ-ల్యాబ్ ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
పాడి రైతులకు ఉపాధి..
గ్రామాల్లో పాడి రైతులకు ఉపాధి కల్పించే దిశగా విజయ డెయిరీ కృషి చేస్తున్నది. అన్ని గ్రామాల్లో ఆసక్తి గల రైతుల నుంచి పాలను సేకరిస్తున్నాం. సకాలంలో రైతులకు రెండు దఫాలుగా డబ్బులను అందజేస్తున్నాం. మరింత మంది రైతుల నుంచి పాలను సేకరించేందుకు గ్రామాల్లో పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతుల పశువులకు విజయ డెయిరీ ద్వారా దాణా, గడ్డి విత్తనాలను సరఫరా చేయాలి, ఇతర ప్రోత్సాహాకాలను అందజేస్తున్నాం.
-సీదర్ల వెంకటస్వామి, మేనేజర్ విజయ డెయిరీ, కడెం