నిర్మల్ టౌన్, మే 10 : జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అందిస్తున్న రుణాల్లో పాడి, కోళ్ల పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి అధికారులకు సూచించారు. జడ్పీ కార్యాలయంలో డీఆర్డీఏ, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రామీణ పేదరిక నిర్మూలన కింద ఐకేపీ సంఘాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు నిర్దేశించి లక్ష్యం మేరకు రుణాలు అందించేలా బ్యాంకర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. బ్యాంక్ లింకేజీ రుణాలతో పాటు స్త్రీనిధి రుణాలను అందించి ప్రతి మండలానికి ఒక పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేసేలా మహిళా సంఘాలను ప్రోత్సహించాలన్నారు. కుటీర పరిశ్రమలపై కూడా అవగాహన పెంచాలని సూచించారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను పెంపొందించుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, జడ్పీసీఈవో సుధీర్కుమార్, జిల్లా పశు వైద్యాధికారి శంకర్, ఎల్డీఎం చంద్రశేఖర్, అడిషనల్ ఏపీడీ గోవింద్రావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ సమీకృత, గురుకుల కళాశాల భవనాల పనుల పరిశీలన..
జిల్లాలో నిర్మిస్తున్న కలెక్టరేట్ సమీకృత భవనంతో పాటు చించోలి గ్రామ సమీపంలోని మైనార్టీ గురుకుల కళాశాల భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల వివరాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పూర్తయిన, మిగిలిన, ప్రారంభించాల్సిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన, ఈ పనులన్ని వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, ఆర్అండ్బీ ఈఈ అశోక్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్యాంరావు రాథోడ్, మైనార్టీ సంక్షేమశాఖ ఆర్సీవో సలీం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే మంచి ఫలితాలు..
సంక్షమ హాస్టళ్లలో ప్రభుత్వం కల్పించిన వసతులు, విద్యార్థులకు అందించిన ప్రోత్సాహంతోనే సంక్షేమ హాస్టళ్లలో మంచి ఫలితాలు వచ్చాయని జిల్లా అధికారులను కలెక్టర్ వరుణ్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో బీసీ సంక్షేమశాఖ ద్వారా నిర్వహించబడుతున్న 15 సంక్షేమ హాస్టళ్లలో మొత్తం 112 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 111 మంది ఉత్తీర్ణులయ్యారని, బీసీ సంక్షేమశాఖలో 171గాను 171మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో పట్టణంలోని సోఫినగర్ గురుకుల పాఠశాల రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా పదో ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదు చేసుకున్నదని ప్రిన్సిపాల్ గంగశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ను కలువగా, ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి లోకేశ్, సాంఘిక సంక్షేమశాఖ అధికారి రాజేశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.