సత్తా చాటిన బాలికలు
రెండో స్థానంలో నిర్మల్.. 32వ స్థానంలో ఆసిఫాబాద్..
ప్రభంజనం సృష్టించిన కస్తూర్బా విద్యార్థులు
కార్పొరేటుకు దీటుగా సర్కారు బడుల్లో ఫలితాలు
ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
పది ఫలితాలపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హర్షం
పదో తరగతి ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. హైదరాబాద్లో ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బాలికల హవా కొనసాగగా.. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా రెండు, ఆదిలాబాద్ తొమ్మిది, మంచిర్యాల 23, కుమ్రం భీం ఆసిఫాబాద్ 32వ స్థానంలో నిలిచాయి. కాగా.. 10/10 జీపీఏను చాలా మంది విద్యార్థులు సాధించారు. ఇగ, కస్తూర్బా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మార్కులు తిరిగి లెక్కించడానికి రీ కౌంటింగ్ కోసం రూ.500, రీ వెరిఫికేషన్కు ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించాలి. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉండనుండగా.. ఫలితాలపై అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్ అర్బన్/ఆదిలాబాద్ రూరల్, జూన్ 30 : పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. సిద్దిపేట జిల్లా 97.85 శాతంతో మొదటి స్థానంలో నిలువగా.. 97.73 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా రెండో స్థానం సాధించింది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి బాలురు 4,713, బాలికలు 4,929 మొత్తం 9,642 మంది పరీక్షకు హాజరు కాగా.. ఇందులో బాలురు 4,571, బాలికలు 4,852 మొత్తం 9,423 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 4,713 మంది పరీక్ష రాయగా.. 4,571 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 4,929 మంది పరీక్షకు హాజరుకాగా 4,852 మంది పాస్ అయ్యారు.
సత్తా చాటిన కేజీబీవీ విద్యార్థులు
కేజీబీవీ విద్యార్థులు సత్తా చాటారు. జిల్లావ్యాప్తంగా 18 కేజీబీవీల్లో 760 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా.. 754 మంది ఉత్తీర్ణులయ్యారు. 12 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. ఇందులో నర్సాపూర్ కేజీబీవీకి చెందిన విద్యార్థులు ఏడుగురు 10/10.. సోన్లో ఇద్దరు, లక్ష్మణచాంద, కడెం, లోకేశ్వరంలో ఒక్కొక్కరు 10/10 జీపీఏ సాధించారు. 266 మంది విద్యార్థులు 9-10 జీపీఏ సాధించగా.. 13 కేజీబీవీలు లక్ష్మణాచంద, మామాడ, ఖానాపూర్, పెంబి, దస్తూరాబాద్, నిర్మల్ అర్బన్, జాం, నర్సాపూర్(జి), కుంటాల, కుభీర్, ముథోల్, సోన్, లోకేశ్వరం కేజీబీవీలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. కాగా.. జిల్లాను పది ఫలితాల్లో ద్వితీయ స్థానంలో నిలిపిన డీఈవో రవీందర్రెడ్డిని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, సెక్టోరియల్ అధికారి శ్రీదేవిని పలువురు అభినందించారు.
పది ఫలితాలపై మంత్రి హర్షం
‘పది’ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవడంపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో కొలువై ఉన్న చదువుల తల్లి బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో ప్రథమ స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తామన్నారు.
ఆదిలాబాద్ తొమ్మిదో స్థానం
పదో తరగతి పరీక్షా ఫలితాలను హైదరాబాద్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా 95.34 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. బాలురు 5,518 మంది హాజరు కాగా.. 5,196 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 5,616 మంది హాజరు కాగా 5,419 మంది పాస్ అయ్యారు. గతేడాది మాదిరిగానే ఈ యేడాది కూడా బాలికలే అధికంగా ఉత్తీర్ణత నమోదు చేశారు. విద్యార్థులు రీ కౌంటింగ్ కో సం రూ.500, రీ వెరిఫికేషన్కు ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు.
15 ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు
ఆదిలాబాద్ జిల్లాలోని 15 ప్రభుత్వ, జడ్పీ పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఆదిలాబాద్ రూరల్లో 2, బజార్హత్నూర్లో 1, బేలాలో 3, భీంపూర్లో 3, బోథ్లో 6, ఇచ్చోడ 2, గుడిహత్నూర్లో 1, ఇంద్రవెల్లిలో 2, జైనథ్లో 6, మావలలో 2, నేరడిగొండలో 3, సిరికొండలో 1, తలమడుగులో 6, తాంసిలో 2, ఉట్నూర్లో 1 పాఠశాలలో 100 శాతం ఫలితాలు సాధించారు. అలాగే 17 కేజీబీవీల్లో ఇంద్రవెల్లి, తోషం, తాంసి, నేరడిగొండ, బజార్హత్నూర్, సిరికొండ, జైనథ్లు 100 శాతం ఫలితాలు సాధించాయి. మోడల్ స్కూళ్లలో నార్నూర్, బోథ్, జైనథ్, బజార్హత్నూర్, బంగారుగూడ పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. మోడల్ స్కూళ్లలో చదివిన విద్యార్థులు ఐదుగురు విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
ఆసిఫాబాద్ 32వ స్థానం..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా 7,007 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 5,605 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 2,582, బాలికలు 3,023 మంది ఉన్నారు. ఏడు పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. అత్యధికంగా మార్కులు సాధించిన వారిలో సయ్యద్ కరిష్మా, మోనశ్రీ,సిద్ధార్థ ఉన్నారు. జిల్లాలో అత్యధిగా జీపీఏ 9.8గా నమోదైంది. కాగా.. జిల్లా రాష్ట్రస్థాయిలో 32వ స్థానంలో నిలిచింది.
మంచిర్యాల జిల్లాకు 23వ..
రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మంచిర్యాల జిల్లా 90.55 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 168 ప్రభుత్వ, 79 ప్రైవేట్ పాఠశాలల్లో మొ త్తం 10,522 మంది (5,449 మంది బాలురు, 5,073 మంది బాలికలు) పరీక్షలు రాయగా, ఇం దులో 9,528 మంది (4,819 మంది బాలురు, 4,709 మంది బాలికలు) ఉత్తీర్ణులయ్యారు. 168 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో 86 శాతం మంది పాసయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతున్నాయనడానికి ఇది నిదర్శనం.