రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 25 : గాంధారీ ఖిల్లా మైసమ్మ జాతర ఆదివారం సాయంత్రం ముగిసింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ (బొక్కలగుట్ట పంచాయతీ సమీపంలోని) శివారు పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన మైసమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి నాయక పోడ్ గిరిజనులు, గిరిజనేతరులు వేలాదిగా తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించి.. మొక్కులు తీర్చుకున్నారు. లక్ష్మీదేవర ముఖ తొడుగులతో ప్రదర్శనలు ఇచ్చారు. సంప్రదాయ నృత్యాలతో హోరెత్తించారు. అక్కడే వంటలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కాళభైరవునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రజాదర్బార్లో పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ ద్వారా రూ. 5 లక్షలు మంజూరు చేయించి జాతరలో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.
వచ్చే జాతర వరకు ఖిల్లా ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, భక్తులకు తాగు నీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో అత్యంత ప్రాచీనమైన, విశిష్ట చరిత్ర గల గాంధారీ ఖిల్లాను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మందమర్రి జడ్పీటీసీ రవి, బొక్కలగుట్ట సర్పంచ్ బొలిశెట్టి సువర్ణ, క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్రెడ్డి, 9వ వార్డు కౌన్సిలర్ పారిపెల్లి తిరుపతి, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, గిరిజన సంక్షేమ అధికారి గంగారాం, తహసీల్దార్ చంద్రశేఖర్, జాతర నిర్వాహకులు, జిల్లా నాయక్పోడ్ సేవా సంఘం రాష్ట్ర నాయకులు పసుల బుచ్చయ్య,పల్ల సత్యనారాయణ, మేచినేని రాజయ్య, గంజి రాజన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెరాజు, అబ్దుల్అజీజ్ పాల్గొన్నారు.