ఎదులాపురం, ఆగస్టు 13 : ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి రిమ్స్ ఆస్పత్రిలోని డైస్ కేంద్రంలో నిర్వహించే ఉచిత పిల్లల గుండె వైద్య శిబిరాన్ని జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. మంగళవారం రిమ్స్లోని డైస్ కేంద్రంలో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు ఉచిత గుండె పరీక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్ కలిసి ప్రారంభించారు.
అధిక సంఖ్యలో గుండె సంబంధిత వ్యాధి పిల్లలు వచ్చారు. వీరిని పీడీయాట్రిక్ కార్డియాలజిస్ట్ సుదీప్ వర్మ పరీక్షించారు. టూడీ ఈకో ద్వారా పరీక్షించి పలువురిని హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఈ సందర్భంగా సుదీప్ వర్మ మాట్లాడుతూ.. ప్రతి 1000 మందిలో 8 నుంచి 10 మంది పిల్లలు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారన్నారు.
ఇక్కడ పరీక్షలు చేసిన వారికి హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో ఉచితంగా శాస్త్ర చికిత్సలు చేస్తామన్నారు. జిల్లాలోని పేద వారికి ఉచితంగా గుండె సంబంధిత వ్యాధులకు చికిత్సలు అందించడానికి కలెక్టర్, వైద్య ఆరోగ్య, డైస్ కేంద్రం ద్వారా శిబిరాన్ని నిర్వహించడం సంతోషమన్నారు. రిమ్స్ ఆర్ఎంవో డాక్టర్ చందు, డైస్ కేంద్రం ఇన్చార్జి మేనేజర్ డాక్టర్ రాధిక, ఫిజియో వైద్యులు నాగర్జున్, అడియోలజిస్ట్ శ్రీనివాస్, వైద్యులు సన, ఆదిత్య, ప్రవీణ్, ఉమకాంత్, ప్రశాంత్ పాల్గొన్నారు.