వానకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆదిలాబాద్ జిల్లాలో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక గ్రామాల్లో సత్వర వైద్యసేవలు అందించడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను సిద్ధం చేశారు. జిల్లాలోని 16 గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మూడు నెలల పాటు ఫీవర్ సర్వే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేయనున్నారు. వర్షాలతో వాగులు పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి గర్భిణులు ఇబ్బందులు పడకుండా పీహెచ్సీల్లో బర్త్ వెయిటింగ్ రూంలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ తెలిపారు.
ఆదిలాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాప్రజలకు వైద్యం అందని ద్రాక్షలాగే ఉండేది. గత పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా సకాలంలో వైద్యసేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వానకాలం వచ్చిందంటే చాలు ప్రజలు సీజనల్ వ్యాధులతో వణికిపోయేవారు. గిరిజన గ్రామాల్లో మలేరియా, టైఫాయిడ్, డెంగీ, డయేరియా వ్యాధులతో ఆదివాసీ గూడేలు, గిరిజన తండాల ప్రజలు సతమతమయ్యేవారు. వైద్యసేవలు సకాలంలో అందక మరణాలు సంభవించేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పేదలకు వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పట్నం నుంచి పల్లె వరకు సర్కారు దవాఖానలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో సేవలు అందేలా వసతులు కల్పించింది. ఫలితంగా జిల్లాలో తొమ్మిదేళ్లుగా సీజనల్ వ్యాధుల ప్రభావం తగ్గిపోయింది. ఏటా వానకాలం ప్రారంభంలో వైద్యశాఖ అధికారులు వ్యాధుల నివారణకు ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకొని ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏడాది సీజన్ ప్రారంభం కావడంతో వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్, మంచినీటి సరఫరా, మున్సిపల్, ఐసీడీఎస్, విద్యాశాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ప్రజల ముంగిట సర్కారు వైద్యం
పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రజల ఇంటి ముందుకు సర్కారు వైద్యసేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా బస్తీ, పల్లె దవాఖానలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లో సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలకు వచ్చిన వారికి అన్ని వ్యాధులకు వైద్యసేవలు అందించడంతో పాటు 95 రకాల ముందులను అందిస్తున్నారు. వ్యాధి నిర్ధారణలో భాగంగా 134రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో రేడియాలజీ ల్యాబ్లో గుండె, ఎముకలు సమస్యలు, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా ఉచితంగా చేస్తున్నారు.
సీజనల్ వ్యాధులపై కట్టుదిట్టం
జిల్లాలో ఈ సీజన్లో మలేరియా, టైఫాయిడ్, డెంగీ, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో సత్వర వైద్య సేవలు అందించడానికి జిల్లా, మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేశారు. జిల్లాలోని 16 గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 89 సబ్ సెంటర్ల కిందికి వచ్చే 718 గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. జూలై 1న ప్రారంభమైన ఈ సర్వే మూడు నెలల పాటు కొనసాగుతుంది. వైద్యబృందాలు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. వారికి వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు చికిత్స అందజేస్తారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా నిర్వహిస్తూ దోమలు పెరగకుండా నీటి నిల్వలను తొలగిస్తున్నారు. వర్షాలతో వాగులు పొంగి పలు గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోతుంది. దీంతో గర్భిణులు ప్రసవం సమయంలో దవాఖానకు రావడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వారం రోజుల ముందుగానే గర్భిణులను దవాఖానలకు తీసుకువచ్చి వైద్యం అందించడానికి జిల్లాలోని ఆదిలాబాద్, ఉట్నూర్, బోథ్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నార్నూర్, బజార్హత్నూర్, నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బర్త్ వెయిటింగ్ రూంలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో వ్యాధులు ప్రబలితే వైద్యసేవలు అందించడానికి జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఎపడమిక్ సెంటర్ను ఏర్పాటు చేసి 08732-295065 ఫోన్ నంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
వైద్య సేవలపై నిరంతర పర్యవేక్షణ
జిల్లాలో వానకాలం ప్రబలే వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసు కుంటున్నాం. కలుషిత నీరు, కీటక జనిత వ్యాధులపై ప్రజలకు అవ గాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో దోమల నివారణలో భాగంగా నీటి నిల్వలు ఉండకుండా, ఆపరిశుభ్రమైన వాతావరణం లేకుండా చర్య లు తీసుకుంటున్నాం. గిరిజన గ్రామాల్లో మూడు నెలల పాటు ర్యాపి డ్ ఫీవర్ సర్వే నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం. 718 గ్రామాల్లో ని 3,76,930 మందికి వైద్య చికిత్సలు అందించడానికి ప్రణాళికలు తయారు చేశాం. పల్లె, బస్తీ దవాఖానల్లో ప్రజలకు అన్ని రకాల వైద్యసేవలు అందించడంతో పాటు 95 రకాల మందులు, 134 వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నాం. రేడియాలజీ ల్యాబ్ ఏర్పాటు వల్ల ఆధునిక వైద్యపరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వైద్యసిబ్బంది సలహాలు, సూచనలు పాటించాలి.
– నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి, ఆదిలాబాద్