కాగజ్నగర్, జనవరి 7: ప్రకృతి అంటేనే ప్రాణికోటి సమాహారం. చెట్టూ.. చేమ, పురుగూ.. పుట్రా, పక్షీ.. పశువూ ఇలా ఒకటి లేకుంటే మరొకటి లేదు. మిలియన్ సంవత్సరాల క్రితమే భువిపై ఆవిర్భవించిన ఈ జీవులు, ప్రకృతి విధ్వంసంతో క్రమంగా అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. కానీ, మన రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ‘హరితహారం’లాంటి కార్యక్రమాలతో వాతావరణంలో మార్పులు ఏర్పడి, ఇటీవలి కాలంలో వాటి సంతతి గణనీయంగా పెరుగుతున్నది.
వేలాది జాతులు..
సీతాకోకచిలుక శాస్త్రీయ నామం రోపలోసెరి. ‘ది బుక్ ఆఫ్ ఇండియన్ బటర్ ఫ్లై’ రచయిత ఇస్సాక్ కెహిమ్కర్ నివేదిక ప్రకారం ప్రపంచంలో రమారమి 18 వేల రకాల జాతులున్నట్లు అంచనా. వీటిని పాపిలియోనాయిడియ, హెనిలియోనాయిడియ అనే రెండు సూపర్ ఫ్యామిలీలుగా విభజించారు. పాపిలియోనాయిడియను పాపిలియొనిడె, పీరిడె, నింఫాలిడె, లైసినిడె పేరుతో మరో నాలుగు కుటుంబాలుగా విభజించారు. మన దేశం విషయానికి వస్తే 1,501 జాతుల సీతాకోక చిలుకలు ఉన్నట్లు ఇస్సాక్ కెహిమ్కర్ పేర్కొన్నారు. బటర్ ఫ్లై కన్సర్వేషన్ సొసైటీ హైదరాబాద్ నివేదిక ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 170 రకాలు ఉన్నట్లు తెలిసింది. అయితే బయోడైవర్సిటీ బోర్డు మాత్రం 153 రకాలు ఉన్నట్లు ప్రకటించింది. ప్రత్యేకించి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో.. భద్రాచలం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు గొల్ల గోపాలకృష్ణ నిర్వహించిన సర్వేలో 76 రకాలు ఉన్నట్లు వెల్లడైంది.
రక్షిస్తేనే మేలు..
ప్రపంచ జీవవైవిధ్యంలో 10 శాతం సీతాకోక చిలుకలతో మన దేశం మెరుగ్గానే ఉంది. కానీ, ఇటీవలి కాలంలో మన దేశంలో కూడా వీటి సంఖ్య ప్రమాదకర స్థాయికి పడిపోతున్నది. దీంతో వీటిపై ఆధారపడిన మాంసాహార జీవజాలంపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆహార చక్రంలో భాగంగా సీతాకోకచిలుకలపై ఆధారపడే సాలీడు పురుగులు, తొండలు, బల్లులు తగ్గే ప్రమాదముంది. తేనెటీగల తర్వాత పూల ఫలదీకరణలో వీటిదే ప్రధాన పాత్ర. సీతాకోకచిలుకలు మకరందాన్ని ఉత్పత్తి చేసే పుష్పాలుగల ఆవృత బీజ మొక్కలతో సమానంగా మిలియన్ ఏండ్ల క్రితమే ఉద్భవించాయి. ఇవి మొక్కలతో విడదీయలేని సంబంధాన్ని కలిగి ఉంటాయి. సీతాకోకచిలుకలు అంతరించడం వల్ల ప్రకృతికి మేలు కలిగించే అనేక రకాల మొక్కలు పూసే పూలు ఫలదీకరణ చెందక వాటి పునరుత్పత్తి నిలిచిపోయే ముప్పు ఉంది. కీటకాలు పర్యావరణ సేవకులు అన్నది ఎవరూ గుర్తించడం లేదు. వీటికి, మొక్కలకు ఉన్న సహజీవన సంబంధం గురించి సాధారణ ప్రజలకు అవగాహన ఉండడం లేదు. అందుకే వీటిని పనికిమాలిన కీటకాలుగా కొట్టి పారేస్తున్నారు. పంటలు ఫలదీకరణ చెందడంలో కూడా ఈ కీటకాలు దోహదపడతాయనే విషయాన్ని గ్రహించలేక పోతున్నారు. పాఠ్యపుస్తకాల్లో పక్షులు, పెద్ద జంతువుల గురించే బోధిస్తున్నారు. కానీ, సీతాకోక చిలుకల లాంటి అల్పప్రాణులకు చోటు లేకుండా పోయింది. ఇప్పటికైనా పాఠ్యపుస్తకాల్లో సీతాకోక చిలుకల జీవిత చరిత్ర, అవి పర్యావరణానికి చేసే మేలు గురించి పాఠాలుగా చేరిస్తే ఎంతో మేలు జరుగుతుంది.
‘హరితహారం’తో మంచి రోజులు..
స్వరాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన టీ(బీ)ఆర్ఎస్ సర్కారు, బంగారు తెలంగాణ దిశగా ముందుకెళ్తున్నది. నాటి సమైక్య పాలనలో అడవులు నాశనమై ప్రకృతి విధ్వంసం జరిగినట్లు గుర్తించింది. తిరిగి అరణ్యాలను పెంచేందుకు ‘హరితహారం’ చేపడుతున్నది. ఇందులో భాగంగా ఏటా కోట్లాది మొక్కలు నాటుతున్నది. ఫలితంగా ఆశించిన రీతిలో వర్షాలు పడుతున్నాయి. ఇదే సమయంలో మిషన్కాకతీయతో జీవం పోసుకున్న చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో సమీప గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి, పర్యావరణానికి మేలు జరుగుతున్నది. అంతటా జీవవైవిధ్యానికి అనుకూల వాతావరణం ఏర్పడుతున్నది. ఐదేండ్ల కాలంలో పెరిగిన సీతాకోకచిలుకలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తున్నది.
ఇదీ జీవిత చక్రం
సీతాకోకచిలుక నాలుగు దశల్లో రూపాంతరం చెందుతుంది. వీటి జీవిత చక్రంలో మొదటిది లార్వా దశ. ఇది మొక్కల ఆకులను అంటిపెట్టుకుని ఉంటుంది. రెండోది కోశస్థ దశ. ఆరు నుంచి ఏడు రోజుల్లో ఒక నిర్మాణం ఏర్పడుతుంది. ఈ దశలో తన చర్మం ద్వారా శ్వాసిస్తుంది. దీనినే గొంగలిపురుగు దశ అంటారు. ఈ దశలో దాని కళ్లు అంత ప్రభావవంతంగా ఉండవు. ఆకులను తిని తన పరిమాణాన్ని పెంచుకుంటుంది. మూడోది విశ్రాంత దశ లేదా ప్యూపా దశ. గొంగలిపురుగు తన చుట్టూ ఒక కోశాన్ని అల్లుకుంటుంది. మొక్కను గట్టిగా అంటిపెట్టుకుని ఉంటుంది. ప్యూపా దశ నుంచి గొంగలిపురుగు కాస్తా సీతాకోకచిలుకగా మార్పు చెందుతుంది. నాలుగోది ఫ్రౌడ దశ. గొంగలిపురుగు కోశాన్ని తొలగించుకుని చిన్న సీతాకోకచిలుకగా బయటకొస్తుంది. ఆపై ఇది ఫ్రౌడ సీతాకోకచిలుకగా మారుతుంది.
ప్రత్యేకంగా పార్కులు..
సీతాకోకచిలుకలను సంరక్షించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకువస్తున్నాయి. వరంగల్లోని కాకతీయ జువలాజికల్ పార్కు (వన్ విజ్ఞాన్) పార్కులో సీతాకోకచిలుకల కోసం 2012లో బటర్ఫ్లై జోన్ ఏర్పాటు చేశారు. ఇందులో సీతాకోక చిలుకలకు ఇష్టమైన తేలు కొండి, గిల్లిగిచ్చ, నందివర్ధనం, నిత్యకళ్యాణి, మందార, మద్రాసి కనకాంభరం, పులికండ, లాంటిన, సంజీవ పెనం, పారిజాతం, పులికంపలాంటి 20 రకాల మొక్కలను పెంచుతున్నారు. ప్రతి మూడు, నాలుగు నెలలకోసారి ఇక్కడి పాత మొక్కలను తీసేసి తాజా మొక్కలను నాటుతుంటారు. అధ్యయనం కోసం కాకతీయ యూనివర్సిటీలో ప్రత్యేక వింగ్ కేటాయించారు. అలాగే హైదరాబాద్లోని నెహ్రూ జూపార్కులో కొంత ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. రామోజీ ఫిలింసిటీలో ఎన్క్లోజర్లో ఒక పార్కు ఏర్పాటు చేశారు.
ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సన్నాహాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దట్టమైన అడవులు ఉన్నాయి. సీతాకోక చిలుకలు జీవించడానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంది. ఫొటోగ్రాఫర్ రాజేశ్కన్ని అడవుల్లో తిరిగి వివిధ రకాల సీతాకోక చిలుకలు, పక్షులు, జంతువులను గుర్తించాడు. త్వరలో జిల్లాలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
– దినేశ్కుమార్, డీఎఫ్వో(ఐఎఫ్ఎస్), కుమ్రం భీం ఆసిఫాబాద్
తగ్గితే ప్రమాదం..
సీతాకోకలు జీవవైవిధ్యంలో కీలకమైనవి. కొన్ని దశాబ్దాల క్రితం ఎక్కడ చూసినా విరివిగా కనిపించేవి. వీటిపై ఆధారపడి సాలీడ్లు, తొండలు, బల్లులు, ఇతర ఎన్నో జీవాలు బతికేవి. కానీ, ఆ తర్వాత వాతావరణ మార్పులు, వ్యవసాయంలో విచ్చలవిడిగా పెరిగిన పురుగు మందుల వాడకం, పారిశ్రామిక కాలుష్యం, ప్రకృతి విధ్వంసం వల్ల వాటి మనుగడకు ప్రమాదం ఏర్పడింది. సీతాకోకచిలుకలు పర్యావరణానికి చేసే మేలు సాధారణ ప్రజలకు తెలియక పోవడం, అతిథేయ మొక్కలు అంతరించడం వల్ల వీటి సంఖ్య చాలా తగ్గిపోయింది.
ఆసిఫాబాద్ అడవుల్లో ఆవాసం..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో అనేక రకాల సీతాకోక చిలుకలు సందడి చేస్తున్నాయి. ఆసిఫాబాద్ డివిజన్లోని అడ, కాగజ్నగర్ డివిజన్లోని పెంచికల్పేట్ మండలం కొండంగలొద్ది, రేగిచెట్టు లొద్ది, కాగజ్నగర్ మండలం కోసిని, వెంపల్లి, తదితర ప్రాంతాల్లో సీతాకోక చిలుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో నియమించిన ఫొటోగ్రాఫర్ రాజేశ్కన్ని అడవుల్లో కలియదిరుగుతూ పక్షులు, సీతాకోక చిలుకలు, జలపాతాలను చిత్రీకరిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సీతాకోక చిలుకలను రాష్ట్ర బటర్ ఫ్లైగా గుర్తించడానికి ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లాలో బటర్ఫ్లై పార్కు ఏర్పాటు చేయాలని పలువురు ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. ఇటీవల ఫొటో గ్రాఫర్ తీసిన అనేక రకాల సీతాకోక చిలుకలు మీ కోసం..
ఎన్నెన్నో విశేషాలు..
సీతాకోక చిలుకలు ప్రపంచంలో ఒక అంటార్కిటికా తప్ప అన్ని ఖండాల్లోని దేశాల్లో కనిపిస్తాయి. ఇందులో క్వీన్ అలెగ్జాండ్రియాస్ బర్డ్వింగ్ అతిపెద్దది. దీని రెక్కల కొలత సుమారు 25 సెంటీమీటర్లు ఉంటుంది. పపువాన్యూగినియాలోని అడవుల్లో కనిపిస్తుంది. మన దేశంలో కనిపించే పెద్దది సదరన్ లర్డ్వింగ్. దీని రెక్కల కొలత 14 నుంచి 19 సెంటీ మీటర్లు. పడమటి కనుమల్లో దర్శనమిస్తుంది. ఇక ప్రపంచంలోనే అతి చిన్న సీతాకోకచిలుక గ్రాస్జువెల్ కూడా మన దేశంలోనే ఉంది. దీని రెక్కల కొలత 1.5 నుంచి 2.2 సెంటీమీటర్లే. ఇదే కోవలోకి వచ్చే టైనీ గ్రాస్బ్లూ కూడా మన దేశంలోనే ఉంది. ఇక ఉత్తర అమెరికాలో కనిపించే వెస్టర్స్ పిగ్మీబ్లూను కూడా అతి చిన్నజాతుల్లో ఒకటిగా గుర్తించారు.
కొన్ని జాతుల జీవితకాలం 12 నెలల వరకు ఉంటుంది. మరికొన్ని కేవలం 15 రోజులు మాత్రమే బతుకుతాయి. ఇవి శీతల రక్త కీటకాలు. వీటి సంచారం, చురుకుదనం వాతావరణ ఉష్ణోగ్రతతో ముడిపడి ఉంటుంది. కనీసం 30 సెంటిగ్రేడ్ ఉంటేనే ఎగురగలవు. అంతకంటే తక్కువగా ఉంటే ఎగురలేవు. వాటి శరీర ఉష్ణోగ్రతలను పెంచుకునేందుకు ఇవి ఉదయం పూట రెక్కలు బార్లాచాపి సూర్యరశ్మిని శోషిస్తాయి. ఇవి వయసు మీద పడే కొద్దీ ఆకర్షణతోపాటు రంగునూ కోల్పోతాయి.
ఇందులో కొన్ని శాఖాహారులైతే.. మరికొన్ని మాంసాహారులు. ఇవి పూలలోని మకరందాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటాయనేది నిజం కాదు. మిగులు పండిన, కుళ్లిపోతున్న పండ్ల రసాలు, చెట్ల నుంచి స్రవించే ద్రవం, బురద, జంతువుల మలమూత్రాలు, మనుషుల చెమట, చనిపోయిన పీతలు, ఇతర జంతువుల శరీర ద్రవాలను కూడా ఆహారంగా తీసుకుంటాయి.
ఇవి 10 నుంచి 12 అడుగుల దూరం మాత్రమే చూడగలుగుతాయి. రంగుల్ని గుర్తించే శక్తి ఎక్కువ. మసక చీకట్లో సైతం 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువులను పసిగడతాయి. మనం చూడలేని అల్ట్రావాయిలెట్ కాంతిని ఇవి చూడగలుగుతాయి. రెక్కలు కూడా ఈ కాంతిని ప్రతిఫలించగలుగుతాయి. మగ సీతాకోక చిలుకల కళ్లు ఆడవాటికంటే పెద్దవిగా ఉండి, రంగుల్ని గుర్తించే కోన్లను ఎక్కువ కలిగి ఉంటాయి. అనేక రకాల జాతుల్లో కాళ్లకు రుచిని గుర్తించే గ్రాహకాలు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్ని రకాల జాతుల తల భాగంలో ఉండే స్పర్శకాలతో వాసనను గుర్తిస్తాయి.
సీతాకోక చిలుకలు ఎగిరే విధానంలో కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. కొన్ని నేలకు దగ్గరగా ఎగిరితే, మరికొన్ని వెయ్యి మీటర్ల ఎత్తులో విహరిస్తుంటాయి. కొన్ని నెమ్మదిగా ఎగిరితే, ఇంకొన్ని గంటకు 50 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. మరికొన్ని 2 వేల మైళ్లు ఆగకుండా వెళ్తాయి. కొన్ని మాత్రం అత్యల్పంగా 8 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తాయి. శీతోష్ణస్థితి, ఆహార లభ్యత, నివాసయోగ్యమైన ఆవాస ప్రాంతాలు లేనపుడు పక్షులవలే ఇవి కూడా కొన్ని వేల కిలోమీటర్లు వలసపోతాయి. అమెరికా ఖండంలోని మోనార్క్ సీతాకోకచిలుక సుమారు 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి దాని గమ్యం చేరుకుంటుందట. అంటే 4 వేల కిలోమీటర్లు ప్రయాణించే శక్తి మోనార్క్ సీతాకోక చిలుకకు ఉందని అర్థం చేసుకోవచ్చు.
ఒకే జాతి సీతాకోకచిలుకల రూపాల్లో చాలా తేడాలుంటాయి. ప్రాంతాన్ని బట్టి, రుతువును బట్టి వాటి రెక్కల్లో అనేక మార్పులు కనిపిస్తాయి. రంగులు, ఆకృతులను బట్టి వాటినవవి రక్షించుకుంటాయి. ప్రత్యుత్పత్తికి అవసరమైన ఆడవాటిలోనే ఈ రక్షణ చర్యలు ఎక్కువగా కనిపిస్తాయి. సీతాకోకచిలుకలను పక్షులు తినవు.ఎందుకంటే ఇవి లార్వా దశలో తిన్న విషపూరితమైన మొక్కల ఆకులను, ఫ్రౌడ దశలో కూడా శరీరంలోనే ఉంచుకుంటాయి. ఈ కారణంగా పక్షులకు ఇవి రుచించవు. పొరపాటున తిన్నా ఆ పక్షులు ఇబ్బందులు పడతాయట.
సీతాకోకచిలుకలకు జీవిత కాలంలో ఎన్నో రకాల మొక్కలు అవసరం. కొన్ని సీతాకోకలు కొన్ని రకాల మొక్కలపైనే గుడ్లు పెడతాయి. వీటిలో ఎక్కువగా కలుపు, పిచ్చి మొక్కలే ఉంటాయి. అవి తిరిగే ప్రాంతాన్నిబట్టి అక్కడ ఉండే పుష్పాలు, ఇతర మొక్కలను అంచనా వేయవచ్చు. బ్లూ మార్మార్ సీతాకోక తిరిగే ప్రదేశంలో నిమ్మ, వెలగ, మారేడు మొక్కలు ఉంటాయని నిర్ధారించుకోవచ్చు. క్రింపన్ రోజ్, కామన్ రోజ్, కామిన్ మర్మాన్ సీతాకోకలు కనిపించే ప్రదేశాల్లో నల్ల ఈశ్వరి, గాడిద గదపాకు తీగ జాతి మొక్కలుంటాయని చెప్పవచ్చు.