మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 5 : ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాలులో నిర్వహించిన మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని నమ్మి ప్రజలు ఆ పార్టీని గెలిపించారని, ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా దాకా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. 2014లో తెలంగాణ వచ్చేనాటికి టెన్త్, ఇంటర్ చదివే పిల్లలకు తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతగా తెలియదని, వీళ్లంతా నేడు 25 నుంచి 35 ఏళ్ల వారయ్యారని, సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారమే ఎక్కువగా వీళ్లను ఆకర్షించిందని చెప్పుకొచ్చారు. కేవలం రెండు నెలల్లోనే కాంగ్రెస్ బండారం బయట పడిందని, ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, తప్పు చేశామన్న భావనలో వారు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం రాగానే ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడేమో మాట మారుస్తున్నారని మండిపడ్డారు.
దేశంలో మూడు రాష్ర్టాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉందని, మరి రాహుల్గాంధీని ప్రధానమంత్రిని ఎలా చేస్తారని ప్రశ్నించారు. “తెలుగువాళ్ల ఆత్మగౌరవం అంటూ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ ఎన్నో పనులు చేశారు. పేద ప్రజల కడుపునింపడానికి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చారు. భూమిశిస్తు రద్దు చేశారు. మండల, జిల్లాపరిషత్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. అయినా మూడోసారి ప్రజలు ఓడించారు. అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపించలేరు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సర్కారు రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించిందని, రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిందని తెలిపారు. అయితే ఎన్ని పనులు చేసినా రెండేళ్ల ముందు నుంచే కాంగ్రెస్, బీజేపీలు కలిసి దుష్ప్రచారాలను చేశాయని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం మాకు లేదని, హామీలిచ్చే ముందు ఆర్థిక స్థితిగతులు ఎందుకు చూసుకోలేదని, అప్పులుచేశారని పదేపదే చెబుతున్న మీరు ఈ 50 రోజుల్లో మీరు అప్పులు ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, చేతగాకపోతే దిగిపోవాలని, సన్నాసులమని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. మంచిరోజులు మళ్లీ వస్తాయని, సమర్థవంతంమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, ప్రజాస్వామ్యం అంటే అధికారమే కాదు, ప్రతిపక్షం కూడా ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించుకొని, వాటిని సవరించుకొని ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలు మనల్ని గెలిపించినప్పుడు ఎలా చూసుకున్నామో.. ఇప్పుడు కూడా అలాగే చూసుకోవాలని, వారి పక్షాన నిలబడి సేవలందించాలని సూచించారు. గడిచిన పదేళ్లలో మనం చేసిన అభివృద్ధిని వివరిస్తూనే.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. జరిగిన పొరపాటు జరిగిపోయిందని, ఇకనైనా కష్టపడి ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణను తెచ్చిన మహానాయకుడు, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన కేసీఆర్ను పట్టుకుని బుడ్డరఖాన్ రేవంత్రెడ్డి ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నాడని, అతన్ని చెప్పుతో కొట్టాలని, కానీ సంస్కారం అడ్డు వచ్చి ఆ పని చేయడం లేదని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమితో భయపడాల్సిన అవసరం లేదని, గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ కోసమని, ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల కోసం కొట్లాడటానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ 420 హామీలు నెరవేర్చాలని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి పదవిని బట్టి.. స్థాయిని బట్టి మాట్లాడాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏ నాయకుడిని పరుష పదజాలంతో దూషించలేదని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినా కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్షమించి వదిలేశామని, ప్రజాస్వామ్య స్ఫూర్తితో పద్ధతిగా పరిపాలన కొనసాగించామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రేవంత్ రెడ్డి అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారని, ఆటో డ్రైవర్లు తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారని అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు.
రైతుబంధు కోసం గత ప్రభుత్వంలో విడుదల చేసిన రూ. 7,700 కోట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్కి, కాంగ్రెస్ కాంట్రాక్టర్ల జేబుల్లోకి మలుపుకొని రైతుల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. పరిపాలన గాలికి వదిలేసి ఆస్తులు సంపాదించుకునే పనిలో పడ్డారని, కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఖజానాపై గద్దల్లా వాలి దోచుకుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మరల్చడానికి కేసీఆర్ను, బీఆర్ఎస్ నాయకులను తిడుతున్నారని, ప్రజల దృష్టిని మరల్చి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కేంద్రంగానీ, పక రాష్ట్రాల వాళ్లుగానీ మన ప్రాజెక్టుల వైపు చూడాలంటేనే భయపడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల అధికారాలన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయాయని, సాగునీరు లేక రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించేదుస్థితికి చేరుకుందని, పరిపాలన చేతకాక గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన అని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు వినోద్, వివేక్ ఎమ్మెల్యేలు అయ్యారని, ఇప్పుడు వివేక్ కొడుకు వంశీకి ఎంపీ టికెట్ ఇవ్వాలని చూస్తున్నారని, ఇది కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ అండగా నిలుస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓడినంత మాత్రాన ఎవరూ కుంగిపోవద్దని, ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం కలిసికట్టుగా పనిచేయాలని, పార్లమెంట్ ఎన్నికల అనంతరం స్థానికసంస్థల ఎన్నికలు వస్తాయని, వాటికోసం కూడా ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్షెటిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన పెంట రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్రావు, తిప్పని లింగయ్య, శ్రీనివాస్రెడ్డి, అత్తి సరోజ, పల్లె భూమేశ్, గోగుల రవీందర్రెడ్డి, సందెల వెంకటేశ్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.