దస్తురాబాద్, జూన్ 24 : ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఖానాపూర్ జూనియర్ సివిల్ జడ్టి జితిన్ కుమార్ సూచించారు. మండలంలోని దేవునిగూడెం, ఆకొండపేట గ్రామాల్లో శనివారం పోలీస్ శాఖ, జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రజలు, మహిళలకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయం ప్రతి ఒక్కరి హక్కు అని అన్నారు. చట్టాలపై అవగాహన ఎంతో అ వసరమని పేర్కొన్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను కల్పించిందన్నారు. ప్రతి ఒక్కరికీ చట్టాల గురించి తెలియాలని, మారుమూల గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లోని ప్రజలు తొందరపడి వివాదాలు పెట్టుకోవద్దన్నారు. ఆ సమస్యలను పెద్దది చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు. న్యాయంగా ఉన్న వారు కోర్టును ఆశ్రయిస్తే తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. దాని కోసం కోర్టులో ప్రత్యేక కమిటీ అందుబాటులో ఉందని తెలిపారు. సమస్యను పోలీస్ స్టేషన్లో పట్టించుకోకపోతే పరిష్కారానికి కోర్టుకు ఎప్పుడైనా రావచ్చని సూచించారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం గ్రామస్తులు జడ్జికి పుష్పగుచ్ఛాన్ని అందజేసి, శాలువాతో సన్మానించారు. అంతకుముందు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు నరేషాచార్యులు స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ముష్కే అంజన్న, దుర్గం పోశలింగం, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మంత్రరాజం, సురేశ్, న్యాయవాది వెంకట మహేంద్ర, పంచాయతీ కార్యదర్శులు రామకృష్ణ, దేవేందర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.