ఖానాపూర్, మే 26 : హరిత తెలంగాణే ధ్యేయంగా ప్రభుత్వం హరితహారం కార్యక్ర మా న్ని చేపడుతున్నది. ఈ బృహత్తర కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు సైతం భాగస్వాములు అవుతున్నారు. సత్తెనపెల్ల్లి గ్రామ శివారులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నర్సరీని ఏర్పాటు చేశారు. మూడేకరాల స్థలంలో నీడనిచ్చే మొక్కల తో పాటు వివిధ రకాల పూల, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. ప్రతి యేటా మూడు నెలల పాటు సుమారు 50 మంది కూలీలకు పని కల్పి స్తున్నారు. కూలీలతో ప్లాస్టిక్ కవర్లలో మట్టి నింపడం మొదలుకొని మొక్కల విత్తనాలు విత్తడం వాటి సంరక్షణ పనులు చేయిస్తున్నారు. విత్తనాలు మొలకెత్తిన తర్వాత వాటికి నిత్యం ఉదయం సాయంత్రం నీటిని పట్టేందుకు ఐదుగురు సిబ్బందిని ఏర్పాటు చేశారు. సత్తెనపెల్లి బీట్ అధికారి వడ్డీ కీర్తిరెడ్డి నర్సరీలో మొక్కలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
నర్సరీలో పెంచే మొక్కలు ఇవీ..
అటవీశాఖ నర్సరీలో అనేక రకాల మొక్కలు పెంచుతున్నారు. నెమలినారా, అల్లోనేరేడు, రావి, మహోగాని, జువ్వి, కానుగ, సీతఫలం, చింత, వేప, బురుగు, మర్రి, పెత్తోరామ్, స్పలోడియా, తెల్లమద్ది, గుల్మోహర్లాంటి మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలు, అనేక రకాల పూల, పండ్ల మొక్కలను సైతం పెంచుతున్నారు. ప్రతి యేటా 50 నుంచి 80 వేల మొక్కలను పెంచుతున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలుపుతున్నారు. నర్సరీ లో పెరిగిన మొక్కలను హరితహారంలో భాగంగా ప్రధాన రహదారితోపాటు గ్రామాల్లోని సీసీ రోడ్లకు ఇరువైపులా, అటవీప్రాంతంలో నాటేందు కు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొంటు న్నారు. కలెక్టర్ అదేశాల మేరకు ఖానాపూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో 3 ఏండ్లుగా హరితహారం కార్యక్రమానికి అటవీశాఖ అధికా రులు మొక్కలు అందజేస్తున్నారు.
మొక్కల సంరక్షణకు కృషి..
ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కల ఎదుగుదలకు నిత్యం రెండు సార్లు నీటిని పడుతున్నా. వేసవికాలంలో మొక్కల సంరక్షణకు అధికారులు సూచించిన పద్ధతులను పాటిస్తున్నాం. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగాయి. ఎండ తీవ్రత ఎక్కవగా ఉండడంతో మొక్కల ఎండిపోకుండా చూస్తున్నాం. రానున్న హరితహారం కార్యక్రమంలో నాటేందుకు నర్సరీలో సిద్ధం చేస్తున్నాం.
– గూడ గంగారం, నర్సరీ కూలీ
ఎనిమిదో విడుత హరితహారంలో నాటేందుకు మొక్కలను సిద్ధం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీలు. అడవిలో నాటేందుకు మొక్కలను అందిస్తున్నాం. పండ్ల, పూల, నీడ నిచ్చే నాణ్యమైన మొక్కల విత్తనాలను తీసుకొచ్చి వాటిని ప్లాస్టిక్ కవర్లలో పెంచుతున్నాం. అటవీలోని ఖాళీ ప్రాంతంలో మొక్కలు నాటి అడవుల శాతం పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
– వినాయక్, ఎఫ్ఆర్వో(ఖానాపూర్)