దిలావర్పూర్, ఫిబ్రవరి 5 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాయామ కేంద్రాలు, ఓపెన్జిమ్లను ఏర్పాటు చేసింది. ఇవి ప్రజలకు ఆరోగ్య ప్రదాయినులుగా ఉపయోగపడుతున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అందరికీ అనుకూలంగా ఉండేలా ప్రతి గ్రామానికీ క్రీడా మైదానం, అవసరమైన చోట్ల ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలో పంచాయతీ జనాభా ప్రాతిపదికన రూ.4 లక్షల పైబడిన నిధులను ఖర్చు చేసి వీటిని ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించింది.
సత్ఫలితాలిస్తున్న ఓపెన్జిమ్లు..
ప్రజలందరి ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలోంచి 70 శాతం పైగా గ్రామ పంచాయతీల్లో ఓపెన్జిమ్లను కూడా ఏర్పాటు చేసింది. అవసరమైన పరికరాలను అమర్చింది. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల ప్రజలకే పరిమితమైన ఓపెన్జిమ్లు, బాహ్య వ్యాయామశాలలు రాష్ట్ర ప్రభుత్వ కృషితో పల్లెల్లోనూ అందుబాటులోకి వచ్చాయి. దీంతో యువకులు, విద్యార్థులు ఉదయం, సాయంత్రం సమయంలో వీటిని వినియోగించుకుంటున్నారు.
నిత్యం పర్యవేక్షణ చేస్తున్నాం..
గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు, ఓపెన్జిమ్లను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. అవసరమైన చోట కావాల్సిన సూచనలు చేస్తున్నాం. వాటి నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిస్తున్నాం. వీటిని ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతంలోని యువకులు, క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
– అజీజ్ఖాన్, ఎంపీవో