మంచిర్యాల అర్బన్, మార్చి 25 : ప్రభుత్వం రైతులు, సహకార సంఘాలు, నిరుద్యోగులకు ఉపాధి చూపడమే కాకుండా వారి ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా నేషనల్ లైవ్స్టాక్ మిషన్(ఎన్ఎల్ఎం) పథకాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు, కోళ్లు, పందుల పెంపకంతో పాటు పశువుల దాణా తయారీ యూనిట్లు కేటాయిస్తోంది. ఒక్కో యూనిట్ విలువ రూ. 20 లక్షల నుంచి రూ. కోటి వరకు ఉంటుంది. ఇందులో ప్రభుత్వమే సగం రాయితీ ఇస్తుంది.
గతంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినా రుణ వ్యయం ఎక్కువగా ఉండడంతో ఆశించిన స్థాయిలో రైతులు ముందుకు రాలేదు. దీంతో విధి, విధానాలు మార్పు చేసింది. నూతన పాలసీ ప్రకారం ఒక యూనిట్కు రూ. 20 లక్షలు నుంచి రూ. కోటి వరకు రుణ సాయం అందించనున్నది. ఈ పథకం గొల్ల, కుర్మలకే కాకుండా అన్ని సామాజిక వర్గాల వారికీ రుణం అందించనున్నది. పశుసంవర్ధక శాఖ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి రుణ సాయం అందించనున్నారు. 2021-22లో ప్రారంభమైన ఈ పథకం 2026-27 వరకు అమల్లో ఉంటుంది.