ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష ( DCC ) ఎన్నికను పారదర్శకంగా చేపడుతామని ఎన్నిక పరిశీలకుడు, ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్ కుమార్( Naresh Kumar ) అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో అధ్యక్ష ఎన్నిక నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశానికి పీసీసీ పరిశీలకులు శ్రీనివాస్, అనిల్ కుమార్, జ్యోతి, ఉపాధ్యక్షురాలు సుగుణక్క, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుల ఎన్నికకు అధిష్టానం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని వెల్లడించారు. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్ష ఎన్నిక నిర్మాణపై వచ్చినట్లు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ గెస్ట్ హౌస్లో ఉదయం 10.30 గంటలకు డీసీసీ స్థాయి సమావేశం , మధ్యాహ్నం 12 . 30 గంటలకు సిర్పూర్ నియోజకవర్గ సమావేశం, 13న జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ నియోజకవర్గస్థాయి సమావేశంఏర్పాటు చేసినట్లు వివరించారు.
14న సాధారణ ప్రజలతో పాటు మేధావుల ద్వారా అభిప్రాయాన్ని సేకరిస్తామని చెప్పారు. ఈనెల 19న పోటీలో ఉన్న అభ్యర్థులతో ముఖాముఖి ఉంటుందని వివరించారు. జిల్లా అధ్యక్ష ఎంపికపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని,పైరవీలకు తావు లేకుండా ఎన్నిక చేపడుతామని స్పష్టం చేశారు. రెండు జిల్లాలలో పర్యటించి నివేదికను అధిష్టానానికి అందిస్తామని , అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ, ఓబీసీ, మహిళా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే దిశగా కృషి చేస్తుందన్నారు.
పార్టీ కోసం కష్టపడేవారిని గుర్తించడంతోపాటు సమర్ధులైన నాయకులను ఎంపిక చేస్తామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి అందరి అభిప్రాయాలను సేకరించడంతోపాటు అభ్యంతరాలను కూడా పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్ ,మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాధవేని మల్లేష్, నాయకులు అనిల్ గౌడ్, అబ్దుల్లా,మునీర్, నాయకులు పాల్గొన్నారు.