కెరమెరి, ఏప్రిల్ 12 : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన లేండిగూడలో తాగు నీటికి తిప్పలు పడాల్సి వస్తున్నది. మిష న్ భగీరథ పథకం ద్వారా వారంలో మూడుసార్లు.. అదీ కూడా కొన్ని ప్రాంతాలకే నీరు సరఫరా చేస్తుండగా, గ్రామస్తులు గొంతు త డుపుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. ఈ గ్రామం గుట్టపై ఉంటుంది. ఇక్కడున్న బోరు కూడా ఎండిపోగా, గుక్కెడు నీటి కోసం గుట్ట కిందున్న బావి, బోరు వద్దకు చేరుకొని నీరు తోడుకుంటున్నారు.
నీటి బిందెలతో గుట్టపైకి ఎక్కడం నరకప్రాయంగా మారింది. పనులన్నీ వదులుకొని నీళ్లకోసమే సమయమంతా కేటాయించాల్సిన దుస్థితి నెలకొంది. పశువుల దాహార్తిని తీర్చేందుకూ అవస్థలు పడాల్సి వస్తున్నది. అలాగే నీటి కొరత కారణంగా కేంద్ర ప్రభుత్వం మంజూ రు చేసిన పక్కా గృహాలు నిర్మించుకోలేక పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నిత్యం తాగు నీరు సరఫరా చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
మా ఊరు గుట్టమీద ఉంటుంది. ఇప్పటి దాకా మిషన్ భగీరథ ద్వారా మంచిగనే నీళ్లిచ్చిన్రు. కొన్ని రోజుల సంది వస్తలేవు. ఉన్న ఒక్క బోరు కూడా ఎండిపోయింది. తాగు నీటికి మస్తు తిప్పలైతంది. ప్రతి రోజూ గుట్ట కిందికి పోయి నీళ్లు తెచ్చుకుంటున్నం. బిందెలు ఎత్తుకొని గుట్ట ఎక్కాలంటే ఆయాసం వస్తున్నది. ముసల్దాన్ని అయితి. ఆరోగ్యం సహకరించకున్నా గోలీలు వేసుకొని నీళ్లు తెచ్చుకుంటున్న. ఇకనైనా అధికారులు మా గోస తీర్చాలే.
– తొగ్రె విఠాబాయి, వృద్ధురాలు, లేండిగూడ
మిషన్ భగీరథ నీళ్లిస్తలేరు. తా గు నీళ్లకోసం బావుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. బిందెల తో గుట్ట ఎక్కడం మస్తు కష్టమైతంది. తెల్లవారుజామున లేచి నీళ్లకోసం ఉరుకుతున్నం. నీళ్లెత్తుకొని గుట్టెక్కుతుంటే కాళ్లు గుంజుతున్నయి. పశువుల కు కూడా తాగు నీళ్లకు తిప్పలైతంది. ఇండ్లు కట్టుకుందామంటే నీళ్లు లేకపాయే. ఇకనైనా మా బాధ పట్టించుకోవాలే.
– సూర్యవంశి హరబాయి, లేండిగూడ